.
బీఆర్ దాదా ఎన్ కౌంటర్ కు ఏడాది
దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ అగ్రనేత ఎన్ కౌంటర్ లో మరణించి నేటికీ సరిగ్గా ఏడాది. ఆయన చనిపోయనప్పుడు ప్రపంచంలోని విప్లవ సంఘాలన్ని కూడా నివాళులు అర్పించాయి. పార్టీ నేతలు కూడా ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. అయితే చనిపోయి ఏడాది అవుతున్నా స్మరించే వారు కరువయ్యారు.
కానరాని సంస్మరణం…
మావోయిస్టు పార్టీని అంతమొందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్లతో పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకపోయింది. బస్తర్ కీకారణ్యాలే లక్ష్యంగా బలగాలు చేపట్టిన కూంబింగ్ వల్ల నక్సల్స్ కార్యకలాపాలు కనుమరుగైపోయాయి. ఇదే క్రమంలో చత్తీస్ గడ్ లో అభూజామఢ్ అడవులుు విస్తరించి ఉన్న నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబల్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ బీఆర్ దాదా ఎన్ కౌంటర్ లో మరణించారు. భారత విప్లవోద్యమ చరిత్రలో కేంద్ర కమిటీ కార్యదర్శి ఎన్ కౌంటర్ లో మరణించడం సంచలనమే అయింది. విప్లవోద్యమానికి బీజం వేసిన చార్ మజుందార్ తరువాత పోలీసు కాల్పుల్లో మరణించింది బసవరాజ్ మాత్రమే. ఆయన మరణం తరువాత ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన విప్లవ సంఘాలు పెద్ద ఎత్తున నివాళులు అర్పించాయి.
విభిన్నం…
విప్లవకారులను స్మరించుకునే ఆనవాయితీ కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం మారిన పరిస్థితులు ఈ కేంద్ర కమిటీ నేతకు నివాళులు అర్పించలేకుండా పోయింది. గత సంవత్సరం వరకూ మావోయిస్టులు చార్ మజుందార్, కానూ సన్యాల్ ల స్మరణం కోసం వారోత్సవాలను నిర్వహించింది. కొయ్యూర్ ఎన్ కౌంటర్ లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యులను స్మరించుకునేందుకు వారోత్సవాలను నిర్వహించేది. అయితే 2025 మే 21న అభూజామఢ్ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన బసవరాజ్ కు నివాళులు అర్పించలేని పరిస్థితి తయారైంది. మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నాయకులు పెద్ద సంఖ్యలో బాహ్య ప్రపచంలోకి రాగా కొంతమంది ఎదురు కాల్పుల్లో మరణించారు. 2026 మార్చి 31 నాటికి పార్టీని అంతమొందిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇదే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్లతో మావోయిస్టు పార్టీ పరేషన్ అయిపోయింది. దీంతో పార్టీ సాయుధ పోరుబాటకు దాదాపుగా ముగింపు పలికినట్టయింది. ప్రస్తుతం పార్టీలో ముప్పాళ లక్ష్మణ్ రావు, నరహరి వంటి ఒకరిద్దరు నాయకులు మాత్రమే మిగిలిపోయినప్పటికీ పార్టీ కార్యకలాపాలు మాత్రం సాగడం లేదు. ఈ కారణంగా పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి హోదాలో మరణించిన బీఆర్ దాదాను స్మరించుకునే పరిస్థితులు లేకుండా పోయాయి.

