దిశ దశ, వరంగల్:
ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు ఉద్రికత్తలకు దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా బస్ స్టేషన్లు, డిపోల వద్ద కార్మికులు నిరసన తెలుపుతున్నారు. యాజమాన్యి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బస్సులను నడిపిస్తోంది. ఈ క్రమంలో నర్సంపేట బస్ స్టేషన్ లో కార్మికులు ఆందోళన చేపట్టిన క్రమంలో అనూహ్యంగా డ్రైవర్ ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో కలకలం లేచింది. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ శంకర్ గౌడ్ అనే కార్మికుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న కార్మికులు అతన్ని నిలువరించారు. అప్పటికే డ్రైవర్ శరీరంపై కాలిన గాయాలు కాగా అతన్ని హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తమ డిమాండ్లు పరిష్కరించనట్టయితే తమకు ఆత్మహత్యే శరణ్యమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు.
రాజీనామాల పర్వం…
మరో వైపున ఆర్టీసీ డిపో వెల్ఫేర్ బోర్డు ప్రతినిధుల రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతోంది. తొలిరోజున పలు డిపోల కార్మికులు తమ బాధ్యతల నుండి తప్పుకోగా రెండో రోజైన గురువారం కూడా మరికొన్ని డిపోలకు చెందిన బోర్డ్ మెంబర్లు రాజీనామా చేశారు.