డంప్ యార్డు వద్దంటూ నిరసన దీక్షలు…

సిర్సపల్లి వాసుల ఆందోళన

దిశ దశ, హుజురాబాద్:

మునిసిపాలిటీల చెత్తను సేకరించి హుజురాబాద్ సమీపంలోని డంప్ యార్డుకు తరలించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం సిర్సపల్లి గ్రామస్థులు స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన దీక్షలు చేపట్టారు. డంప్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల తాము అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సిర్సపల్లి- కొత్తపల్లి సమీపంలో డంప్ యార్డు ఏర్పాటు చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని సిర్సపల్లి వాసులు డిమాండ్ చేశారు. డంప్ యార్డు ప్రభావం పంటలపై కూడా తీవ్రంగా పడునుందని దీనివల్ల ఆహారం విషతుల్యంగా మారే ప్రమాదం లేకపోలేదని స్థానికులు అంటున్నారు. కాలుష్యం కోరల్లో చిక్కుకుని తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగించాల్సిన దుస్థితి నెలకొంటుందని నిరసనల కారులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ ఈటల రాజేందర్, మండలి విప్ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జి వొడితెల ప్రణవ్ బాబుల మద్దతు కూడగట్టుకుని ముందుకు సాగనున్నామన్నారు. నిరసన దీక్షా శిబిరంలో అఖిల పక్షం కో ఆర్డినేటర్ పల్కల ఈశ్వర్ రెడ్డి, సిర్సపల్లి సర్పంచ్ పోల్సాని రామారావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ బండ శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రాజపల్లి సర్పంచ్ కటుకూరి మల్లారెడ్డి, జయన్న ఫౌండేషన్ అధ్యక్షడు జయపాల్ రెడ్డి, న్యాయవాది ముక్కెర రాజు, ఎవల్లి కొండాల్ రెడ్డి, జనగామ రాజ్ కుమార్, విజయ్ కుమార్, వెంకట్రావు, వేమారెడ్డి, వెంకట్ రెడ్డి, కల్లెపు హన్మంత రావు, పద్మారెడ్డి, ఐలయ్య రుద్రారపు రాయచంద్రం, కామకోటి కిషన్ రావు, ఐలయ్య, రవిందర్ తదితరులు పాల్గొన్నారు.