దిశ దశ, భూపాలపల్లి:
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే అమ్మాయిల పట్ల ఆకతాయిలు వ్యవహరిస్తున్న తీరుపై అక్కడి పోలీసులకు తెలిసింది. ఈవ్ టీజింగ్ కు పాల్పడుతన్న ప్రభుద్దుల ఆగడాలు కట్టడి చేయాలన్న అభ్యర్థనలపై దృష్టి పెట్టాలని మహిళా ఎస్సై భావించారు. వారిని కట్టడి చేసేందుకు యూనిఫాంతో వెల్తే సరికాదని భావించారా ఎస్సై. తాను కూడా పదో తరగతి విద్యార్థినిలా చేతిలో ఎగ్జామ్ ప్యాడ్ పట్టుకుని మిగతా స్టూడెంట్స్ తో కలిసి స్కూలుకు చేరుకున్నారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో అల్లరి మూకలు చేసే పనులను నిశితంగా పరిశీలించేందుకు ఇలా మారిపోయారు.

భూపాలపల్లి జిల్లా…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల పట్ల ఈవ్ టీజింగ్ కు పాల్పడుతున్న వారిని నియంత్రించేందుకు స్థానిక ఎస్సై ఎవరికీ అనుమానం రాకుండా విద్యార్థిని రూపం దాల్చారు. లాఠీ… యూనిఫాంతో కాకుండా సాధారణ స్టూడెంట్ గా పాఠశాలకు చేరుకున్నారు. ఎగ్జామ్స్ డ్యూటీ చేస్తున్న మహిళా కానిస్టేబుళ్లు కూడా తమకేమీ తెలియనట్టుగా నడుచుకున్నారు. ఎస్సై అమూల్య పదో తరగతి పరీక్షలకు హాజరైనట్టుగానే వెల్లి ఆకతాయిల గురించి ఆరా తీశారు. హడావుడి చేస్తూ విధులు నిర్వర్తించినట్టయితే అల్లరి చేసే వారిని గుర్తించడం సాధ్యం కాదని గమనించి ఇలా తనదైన స్టైల్లో డ్యూటీ చేశారు ఎస్సై అమూల్య.
డెకాయి ఆపరేషన్…
సాధారనంగా పొలీసు అధికారులు డెకాయ్ ఆపరేషన్ చేపడుతుంటారు. రద్దీ ప్రాంతాలు, మాల్స్ వద్ద భద్రతా చర్యలు ఎలా ఉన్నాయి, రక్షణ చర్యలు ఎలా తీసుకుంటున్నారు అన్న విషయాలను గమనించేందుకు సాధారణ వ్యక్తులతో కలిసి పోయి డెకాయ్ ఆపరేషన్ చేపడుతుంటారు. దీనివల్ల అగంతకులు జనాల్లోకి వచ్చి విధ్వంసకర చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు ఇలాంటి ఆపరేషన్లు చేపడుతుంటారు. ఇందు కోసం కొంతమంది బృందాన్ని ఉన్నతాధికారులు నియమించి ఆపరేషన్ చేస్తుంటారు. అయితే టేకుమట్ల ఎస్సై అమూల్య మాత్రం ఒక్కరే విద్యార్థినిగా ఈవ్ టీజర్లను కట్టడి చేసేందుకు డెకాయ్ ఆపరేషన్ మాదిరిగా ఆరా తీయడం గమనార్హం. పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల్లో భరోసా కల్పించేందుకు టేకుమట్ల ఎస్సై తీసుకున్న నిర్ణయం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

