ఛీ. ముఖాలు చూడటం ఇష్టం లేదు… బెంచీల మీద ఎందుకు కూర్చున్నారు..? కింద కూర్చోండి… లేదంటే బయట కూర్చోండి. ఇదీ ఓ అధికార పార్టీ సర్పంచ్ అంగన్వాడీ టీచర్లపై చేసిన వ్యాఖ్యలు.. దీంతో వారు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు..
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్లోని అంగన్వాడీ టీచర్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మాదారం టౌన్షిప్ సర్పంచ్ కుశనపల్లి లక్ష్మీనారాయణ తమను అవమానించారని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము గ్రామసభకు వెళ్లినప్పుడు స్థానిక సర్పంచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… అంగన్వాడీల పనితీరు ఏం బాలేదంటూ… మీరు బెంచీల మీద ఎందుకు కూర్చుంటున్నారు..? కింద కూర్చోండి… లేదంటే బయట కూర్చోండి అవసరం ఉన్నప్పుడు పిలుస్తామంటూ వ్యాఖ్యానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఛీ… మీ ముఖాలు చూడటం ఇష్టం లేదంటూ దురుసుగా మాట్లాడారని వెల్లడించారు. 50 ఏళ్ల పైబడిన వాళ్లమని కింద కూర్చోలేక పోతున్నామని చెప్పగా ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చోండని ఘటుగా వ్యాఖ్యానించారన్నారు. 35 సంవత్సరాలుగా అంగన్ వాడీ టీచర్లుగా విధులు నిర్వహిస్తున్నామని, అనారోగ్య కారణాలతో బెంచీలపై కూర్చున్నందుకు విచక్షణ లేకుండా మాట్లాడి తమను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

