నకిలీ డాక్యూమెంట్లు క్రియేట్ చేసి… లింక్ కోసం రిజిస్ట్రేషన్లు చేస్తూ…

దిశ దశ, కరీంనగర్:

ఓపెన్ ప్లాట్ కనిపిస్తే చాలు యజమానితో సంబంధం లేకుండానే డాక్యూమెంట్లు పుట్టుకొస్తాయి. వీటి ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తూ లింక్ డాక్యూమెంట్లూ క్రియేట్ అవుతాయి. ఆ తరువాత మార్కెట్ లో సదరు ప్లాట్ అమ్మకానికి పెట్టడం జరుగుతుంది. ఇది కరీంనగర్ లో ఓ ముఠా పాల్పడుతున్న దందా. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ టూ టూన్ ఇన్స్ పెక్టర్ సృజన్ రెడ్డి కథనం ప్రకారం… కరీంనగర్ పద్మనగర్ నివాసి కిన్నెర మల్లవ్వ (50), భామండ్ల రవిందర్, గన్నేరువరం మండలం చీమలకుంటపల్లికి చెందిన (46), కరీంనగర్ మార్కండేయనగర్ కు చెందిన లోకిని పోచయ్య (45), సప్తగిరి కాలనీ టెలిఫోన్ క్వార్టర్స్ కు చెందిన అనుముల బాలయ్య (40), మార్కండేయనగర్ కు చెందిన లోకిని ఆదిత్య (21), లోకిని రాజవ్వ అలియాస్ రాజమ్మ (40)లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. పద్మనగర్ లోని సర్వే నెంబర్ 212లో 242 చదరపు గజాల స్థలానికి సంబంధించిన నకిలి డాక్యూమెంట్లు సృష్టించి, రిజిస్ట్రేషన్ చేస్తూ లింక్ డాక్యూమెంట్లు తయారు చేసుకుంటున్నారు. లింక్ డాక్యూమెంట్లతో సదరు భూమిని ఆక్రమించి విక్రయించారని బాధితులు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి అరెస్ట్ చేశారు. 

ఒకే కుటుంబం…

భార్య, భర్త, కొడుకు ముగ్గురు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. వీరు ముగ్గురు కూడా లింక్ డాక్యూమెంట్లను సృష్టించారని పోలీసులు అరెస్ట్ చేశారు. లోకిని పోచయ్య, ఆయన కొడుకు లోకిని ఆదిత్య, పోచయ్య భార్య రాజవ్వ అలియాస్ రాజమ్మలపై కేసు నమోదు అయింది. అయితే నకిలీ డాక్యూమెంట్లు తయారు చేయడంలో ఏకంగా ఓ ఫ్యామిలీ భాగస్వామ్యం ఉండడం గమనార్హం. మార్కెట్ లో భారీగా పలుకుతున్న భూములు తక్కువ ధరకే విక్రయిస్తున్నారన్న విషయం తెలిసి కూడా ఈ కేసులో నిందితులు కొనుగోలు చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.