రిజిస్ట్రేషన్ కార్యాయాల్లో పెత్తనం వారిదేలా..?

దిశ దశ, వరంగల్:
అనధికారికంగా అధికారం చెలాయించే సత్తా వారికి మాత్రమే ఉంది. అధికారికంగా వారి భాగస్వామ్యాన్ని ప్రొత్సహించడమూ ఆ అధికారులకే చెల్లింది.
రిజిస్ట్రేషన్ ఆఫీసు అంటేనే ఠక్కున గుర్తుకు వచ్చేది డాక్యూమెంట్ రైటర్లు. వేళ్లూనుకున్న డాక్యూమెంట్ రైటర్ల వ్యవస్థ కారణంగా సామాన్యుడు చేయి తడిపితే తప్ప పని అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. తాజాగా వరంగల్ ఏసీబీ కార్యాలయంపై దాడులు చేసినప్పుడు సంచలన విషయాలు బయటపడ్డాయి.

వాట్సప్ ఛాటింగ్స్…

వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సోదాలు చేసినప్పుడు అవినీతికి పాల్పడుతున్న తీరు అంతా ఇంతా కాదని తేలింది. కొంతమంది డాక్యూమెంట్ రైటర్ల మొబైల్స్ స్వాధీనం చేసుకుని వాట్సప్ ఛాటింగ్ పరిశీలించడంతో రిజిస్ట్రేషన్ అధికారులు గుట్టు బట్టబయలైంది. వరంగల్ ఆఫీసులో సబ్ రిజిస్ట్రార్ 1, 2లు ఇద్దరూ కూడా వీరి ద్వారా తమ అవినీతి సొమ్మును వసూలు చేసుకుంటున్నారని తేలింది. ఎస్ఆర్వోలు జమలాపురం రామనర్సింహరావు, దవులూరి ఆనంద్ లు డాక్యూమెంట్ రైటర్లు కం ఏజెంట్ల ద్వారా ఏడాదిలో రూ. 42 లక్షల వరకూ లంచం వసూలు చేసినట్టుగా గుర్తించారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన లావాదేవీలు జరిపేందుకు డబ్బులు ఎంత వసూలు చేయాలో SROలు వాట్సప్ చాటింగ్ ద్వారా ఏజెంట్లకు వివరించారు. వారు చెప్పినట్టుగా డబ్బులు వసూలు చేసుకుని వాటిని సదరు అధికారులకు అప్పగించేవారు. దీంతో పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 20 మంది డాక్యూమెంట్ రైటర్లను గుర్తించడంతో పాటు, రిజిస్ట్రేషన్ పూర్తయినా డాక్యూమెంట్లు ఇవ్వకుండా అధికారులు గతవద్దే అట్టిపెట్టుకుంటున్నారు. తమకు లంచం ముట్టలేదన్న సాకుతో రూ. 204 డాక్యూమెంట్లను ఏసీబీ అధికారులు సోదాల్లో గుర్తించారు. మరోవైపున SROలిద్దరి ఇండ్లలో సోదాలు చేశారు ఏసీబీ ప్రత్యేక బృందాలు. ఆనంద్ ఇంట్లో 24.16 లక్షల నగదు, 819.500 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.6 కిలోల వెండి, కపిల్ చిట్స్ రూ. 30.10 లక్షల ఫిక్స్ డిపాజిట్లు స్వాధీనం చేసుకున్నారు.

వారెవరూ..?

వాస్తవంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యూమెంట్ రైటర్ల విధానం గతంలోనే రద్దయింది. అయినప్పటికీ అక్కడ డాక్యూమెంట్ రైటర్లదే పెత్తనం సాగుతుండడం విస్మయం కల్గిస్తోంది. వీరి ద్వారా వెల్లిన ఫైళ్లకు మాత్రమే మోక్షం కలుగుతోంది తప్ప ఆస్తుల క్రయవిక్రయాలు జరిపే వారికి మాత్రం నేరుగా సేవలందించే పరిస్థితి లేకుండా పోయింది. వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యూమెంట్ రైటర్ల ద్వారా వస్తేనే పనులు సాఫీగా జరిగిపోతున్నాయన్న ఫిర్యాదులు ఏసీకీ అందడం గమనార్హం. డాక్యూమెంట్లపై కూడా వీరు సంతకాలు చేసే ఆనవాయితీ నేటికి కొనసాగుతోంది. అనధికారికంగా ఆధిపత్యం చెలాయిస్తున్న డాక్యూమెంట్ రైటర్ల విషయంలో కట్టడి చేయనట్టయితే ఇష్టారీతిన వసూళ్ల పర్వం కొనసాగుతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.