దిశ దశ, మంథని:
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో పర్యటించారు. జనారణ్యంలోకి వచ్చిన ఆయన మొదటి సారి మంథనికి వచ్చారు. శనివారం మంథనికి చేరుకున్న ఆయన స్థానిక కాంగ్రెస్ నాయకురాలు మూల సరోజన ఇంట్లో కొద్దిసేపు ఉన్నారు. ఆ తరువాత స్వగ్రామమైన శాస్త్రుల్లపల్లికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన్ను కలిసిన కొంతమందితో మాట్లాడిన రాజిరెడ్డి తనకు పరిచయం ఉన్న వారి గురించి వాకబు చేశారు.
రాజకీయాలకు దూరం…
రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఎన్నికల్లో పాల్గొనేది లేదని మల్ల రాజిరెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ పెట్టే ఉధ్దేశ్యం కూడా లేదని కుండబద్దలు కొట్టారు. మంథనిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రజా ఉధ్యమాలు, సమాజ సేవలో భాగస్వామ్యం అయ్యే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవల్సి ఉందన్నారు. ఈ ప్రతిపాదనను ఇప్పటికే ప్రభుత్వం ముందు ఉంచినట్టుగా వెల్లడించారు. చాలా కాలం పాటు విప్లవోద్యమంలో పని చేసి బయటకు వచ్చానని, బంధువులను కలిసేందుకు మాత్రమే వచ్చానని వెల్లడించిన ఆయన లీగల్ గా పని చేసేందుకు అనుమతిస్తే ఆలోచిస్తామన్నారు.
46 ఏళ్లకు…
46 ఏళ్ల తరువాత మల్ల రాజిరెడ్డి తన స్వగ్రామానికి వచ్చారు. 1999 జనవరిలో రాత్రి పూట వచ్చి వెళ్లానని ఆ తరువాత ఇప్పుడే వచ్చానన్నారు.