దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ ఏరివేత ఇంకా కొనసాగుతూనే ఉంది. చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో తెలంగాణాకు చెందిన మహిళా మావోయిస్టు నక్సల్ మృతి చెందినట్టుగా పోలీసు వర్గాల సమాచారం. కాంకేర్ జిల్లాలోని చోటేభాటియా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నారన్న సమాచారం అందుకున్న బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కూంబింగ్ చేస్తున్న బలగాలకు మావోయిస్టులు ఎదురు కావడంతో ఎదురుకాల్పులు జరిగినట్టుగా పోలీసు వర్గాల సమాచారం ఈ ఘటనలో ఏసీఎం రూపీ ఎన్ కౌంటర్ లో మరణించినట్టుగా ప్రాథమిక సమాచారం. ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య వార్త శేఖర్ భార్యగా పోలీసు రికార్డులో ఉంది.
నలుగురే…
తెలంగాణాకు చెందిన ఐదుగురిలో రూపీ మరణించడంతో ఆ సంఖ్య నలుగురికి పడిపోయింది. ముప్పాళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, పసునూరి నరహరి అలియాస్ సంతోష్, జోడె రత్నాభాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగ్తూలు మిగిలారు. గత కొంతకాలంగా వీరిని కూడా జనజీవనంలో కలవాలని పోలీసుల పిలుపునిచ్చారు. వారు మాత్రం బాహ్య ప్రపచంలోకి రావడానికి ఆసక్తి చూపడం లేదు.