దిశ దశ, కరీంనగర్:
అల్లారు ముద్దుగా పెంచాల్సిన చిన్నాలిద్దరిని చితికి చేర్చాడో తండ్రి… కవలలుగా జన్మించిన వారు ఆడ బిడ్డలు కావడమే వారి పాలిట శాపమైంది. కన్నా అంటూ పిలిచే నాన్న అనుకున్న ఆ పసి బిడ్డలు తండ్రితో పాటు వెళ్లి విగతజీవులయ్యారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూబ్లీ నగర్ లో జరిగిన దారుణ ఘటన వెనక దాగి ఉన్న నిజమేంటంటే..?
కవలలు…
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మౌనికను జూబ్లీనగర్ నివాసి కచ్చు శ్రీశైలం ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరి దాంపత్య జీవనానికి కవల బిడ్డలు జన్మించారు. మౌనిక ఆడబిడ్డలను జన్మనివ్వడమే శాపంగా మారింది. మౌనిక, శ్రీశైలం మధ్య గొడవలు జరుగుతుండేవని, ఆడ బిడ్డలు పుట్టిన తరువాత ఇవి తారస్థాయికి చేరాయని స్థానికులు చెప్తున్నారు. శుక్రవారం భార్య భర్తలిద్దరు గొడవ పడిన తరువాత బిడ్డలైన గీతాన్షి, గీతాన్వికలు బైక్ పై తీసుకెళ్లాడు శ్రీశైలం. తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలను అందులో వేసి చంపేశాడు.
నాటకం…
అయితే బిడ్డలను కాటికి పంపిన తండ్రి శ్రీశైలం నాటకం ఆడినట్టుగా ప్రతక్ష్య సాక్షులు చెప్తున్నారు. బిడ్డలను ముందుగా బావిలో వేసిన తరువాత ఆయన కూడా బావిలో దూకి ఓ బిడ్డను తీసుకుని పైకి వెచ్చి లబోదిబోమనడం మొదలు పెట్టాడు. సమీపంలోని పంటపొలాల్లో పని చేస్తున్న స్థానికులు గమనించి శ్రీశైలం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా ఇంట్లో గొడవ పడి బిడ్డలను వెంట తీసుకెళ్లాడని, భార్య కూడా వస్తానన్న నిరాకరించాడని తేలింది. ఆడ బిడ్డలు పుట్టారన్న కారణంతో పాటు భార్యతో ఉన్న విబేధాల వల్లే గీతాన్షి, గీతాన్వికలను తండ్రి శ్రీశైలం చంపాడని కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఘటనా స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసీపి విజయ్ కుమార్ సందర్శించారు.