దిశ దశ, రామగుండం:
ఈధురు గాలులతో కూడిన వర్షంతో జనజీవనం అతలాకుతలం అయింది. ప్రకృతి బీభత్సంతో ఒక్క సారిగా చెట్లు నెలకొరిగాయి. ప్రధాన రహదారుల విరిగిపోయిన చెట్లతో నిండిపోయాయి. వాహనాల రాకపోకలకు ఆటంకంగా మారడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అర్థరాత్రి పోలీసులు కార్యరంగంలోకి దిగారు. రామగుండం కమిషనరేట్ పోలీసులు అర్థరాత్రి రోడ్లపై పడ్డ చెట్లను తొలగించారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ లలో మంగళవారం అర్థరాత్రి గాలి దుమారంతో కూడిన వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. దీంతో ఎక్కడికక్కడ చెట్లు రోడ్లపై విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. రాత్రివేళల్లో ప్రయాణించే వాహనదారులు రోడ్లపై పడిపోయిన చెట్ల కారణంగా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని గమనించిన పోలీసు అధికారులు వాటిని తొలగించారు. మంచిర్యాల పరిధిలోని హాజీపూర్, లక్షెట్టిపేట, దండెపల్లి రహదారులపై గాలి దుమారినిక పడిపోయిన చెట్లను స్థానికుల సహకారంతో తొలగించారు. దీంతో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పడింది.

సీపీ విజిట్…
మంచిర్యాల జోన్ పరిధిలో అకాల వర్షం సృష్టించిన బీభత్సం గురించి సమాచారం అందుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అర్థరాత్రి సీపీ దండెపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా కొత్తూరు బస్ స్టాప్ సమీపంలో గోడ కూలి ఇద్దరు మృతి చెందగా, గంపలపల్లి శివారులోని సామిల్ గోడ కూలడం ఇద్దరు మరణించారని తెలుసుకున్న ఆయన ఘటన స్థలాలను పరిశీలించారు. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను సీపీ ఆదేశించారు.


