దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ జిల్లాలో జరిగినో ఓ భారీ దొంగతనం కేసులో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధి ఒకరి ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ సమీపంలోని ఓ ఇంట్లో కొంతకాలం క్రితం ఓ రోజు ఉండిపోయాడు. తీసుకున్న సదరు ప్రజా ప్రతినిధి అక్కడ ఉన్న నగదును తీసుకెళ్లినట్టుగా పోలీసుల విచారణలో తేలడంతో సదరు మాజీ ప్రజా ప్రతినిధిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సదరు నాయకుడు చోరీకి పాల్పడినట్టుగా ఆధారాలు సేకరించిన పోలీసులు అతన్ని పట్టుకుని విచారించినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. ఈ కేసులో ఓ మహిళ కూడా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టుగా సమాచారం.
ల్యాప్ ట్యాప్…
అయితే ఇదే ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ నెల మొదటి వారంలో మరోసారి చోరీ జరిగింది. అగంతకులు ఓ ల్యాప్ ట్యాప్ ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కరీంనగర్ రూరల్ పోలీసులు రంగంలోకి దిగి చోరీ కేసును దర్యాప్తు చేయడం ఆరంభించారు. ఈ విషయాన్ని గమనించిన అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న మరో వ్యక్తి తన ఇంట్లో నగదు ఉంచానని వాటిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని పోలీసులకు చెప్పుకున్నాడు. భారీగా ఉంచిన నగదు చోరీ జరిగిన విషయాన్ని తాను బయటకు చెప్పుకోలేకపోయానని, తన భార్య అనారోగ్యం కారణంగా ఆమెకు తెలిస్తే ఇబ్బందికరపరిస్థితులు ఎదురవుతాయని ఫిర్యాదు చేయలేకపోయానని వివరించినట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు నగదు చోరీ చేసిన కేసును కూడా దర్యాప్తు చేయడంతో సదరు ప్రజా ప్రతినిధి ప్రమేయం ఉన్నట్టుగా తేలినట్టు సమాచారం. ఫస్ట్ ఫ్లోర్ లో తాము ఉన్నది నిజమేనని సదరు ప్రజా ప్రతినిధి డబ్బులు తీసుకెళ్లింది నిజమేనని ఆ రోజు ఆయనతో పాటు ఉన్న మహిళ కూడా పోలీసులకు వివరించినట్టుగా తెలిసింది.

