దిశ దశ, మహధేవపూర్:
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ నెల 20 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ అయిన మేడిగడ్డను పరిశీలించనున్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDASA) సూచనల మేరకు బ్యారేజీని పునరుద్దరించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మేడిగడ్డపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి బ్యారేజీని పునురుద్దరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా పూణే నిపుణులచే పరీక్షలు నిర్వహించి బ్యారేజీని బాగు చేయించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డను సందర్శించి జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలపై సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరంలో నిర్వహించనున్న పుష్కరాల సందర్భంగా చేపట్టనున్న అభివృద్ది పనులపై కూడా సమీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ లు క్షేత్ర స్థాయి పరిశీలన జరిపారు.