దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ జిల్లాలో మానేరు నదిలో ఇసుక రీచుల నిర్వహాకుల ఇష్టారాజ్యం నడుస్తోందా..? ప్రభుత్వంపై మాత్రమే దృష్టి సారించడంతో ఇతర నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారా..? పర్యావరణానికే సవాల్ విసురుతున్న తీరు దేనికి సంకేతం..?
నదుల లోతు ఎంతో..?
కరీంనగర్ జిల్లా మానకొండూరు, వీణవంక మండలాల్లోని ఇసుక రీచుల్లో నిర్వాహకులు తవ్వకాలు జరుపుతున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. టెండరు ప్రభుత్వ ఏర్పాటు చేసిన రీచులు, పనుల కోసం రీచులతో పాటు ఏవేవో సాకుల పేరుతో కొనసాగుతున్న ఇసుక తవ్వకాల తీరుపై నిఘా వేసే అధికారులు లేకుండా పోయారు. దీంతో మానేరు నదిలో ఇసుక తవ్వకాల్లో ఇష్టారాజ్యంగా నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి రీచుకు ఎంత విస్తీర్ణంలో ఇసుక తవ్వాలో నిర్ణయించి ప్రత్యేకంగా హద్దులను ఏర్పాటు చేయాలి. 1 మీటరు నుండి 2 మీటర్ల కంటే ఎక్కువ లోతులో తవ్వకాలు జరపకూడదని TGMDC బాజాప్తాగా చెప్తోంది. కానీ వాస్తవంగా ఎం జరుగుతోంది అన్న విషయాలపై మాత్రం దృష్టి సారించే వారు లేకుండా పోయారు. మానకొండూరు, వీణవంక రీచుల్లో తవ్వకాలు జరుపుతున్న తీరుకు సంబంధించిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఏకంగా మట్టికూడా వచ్చిందంటే ఎంత లోతులో ఇసుక తవ్వకాలు జరిపారో అర్థం చేసుకోవచ్చు. నదిలో ఒకే లెవల్లో ఇసుక తవ్వకాలు జరపాల్సి ఉండగా నచ్చిన చోట గుంతలు గుంతలుగా తవ్వుతున్న తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే ఓ రీచులో అయితే నీటి గుంతలను మరిపిస్తున్న విధంగా తవ్వకాలు జరిపిన తీరు విస్మయానికి గురి చేస్తోంది.
నిఘా ఏది… నివేదికలేవి..?
TGMDC ఇసుక రీచులలో ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తోంది. అయితే స్టాక్ యార్టు ఇసుక తరలించే విషయాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు ఈ తాత్కాలిక ఉద్యోగులు. ప్రాజెక్టు ఆఫీసులు, అసిస్టెంట్ డైరక్టర్ స్థాయి అధికారులను నియమించిన వీరు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన దాఖలాలు అంతంత మాత్రమే. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన రీచుల ద్వారా వేల సంఖ్యలో లారీలు తరలిపోతున్న నేపథ్యంలో టీజీఎండీసీ నామమాత్రమైన చర్యలకే పరిమితం అవుతోందన్న విమర్శలు ఉన్నాయి. కనీసం తమ సంస్థ నిర్దేశించిన నిబంధనలు అమలు చేయాలన్న చొరవ చూపించే ప్రయత్నాలే జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇసుక రీచుల్లో జరుగుతున్న నిబంధనల పాతర తీరుపై ఆరా తీయాల్సిన సంబంధిత శాఖలు కూడా తమకేమీ పట్టనట్టుగా ఉన్నాయి. మానేరు నదిలో చెక్ డ్యాంలు కట్టాలన్న ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో గుంతలు గుంతలుగా తవ్వకాలు జరిపిన వరద ప్రవాహం ఉధృత్తి పెరిగే ప్రమాదం దీనివల్ల చెక్ డ్యాంలపై ఒత్తిడి తీవ్రంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇరిగేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారా లేదా అన్నది ఆ శాఖ అధికారులకే తెలియాలి. ఇకపోతే శాఖ ఈ కొద్ది లోతు నుండి ఇసుక సేకరించినట్టయితే భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందన్న విషయంపై భూగర్భ జలవనరుల ఎందుకు దృష్టి పెట్టలేకపోతోందన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. సహజ వనురులు అందజేసే మానేరు నదిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్న తీరు వల్ల పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఎత్తి చూపుతున్నారా లేదా అనేది సంబంధిత శాఖ ఏం చేస్తోందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇలాంటి వాటిని కట్టడి చేయనట్టయితే మానేరు నది అస్తిత్వం ఏమైపోతోందోనని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.