Sand : మానేరు నది సాక్షిగా అధికారుల వింత నిర్ణయాలు…

ఏళ్లుగా ఇదే తంతు… ఏనాటికి ముగుస్తుందో వారి వంతు…

దిశ దశ, హుజురాబాద్:

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా… అన్న నానుడి సరిగ్గా సరిపోతుంది మానేరు నది తీరంలో సాగుతున్న ఇసుక తవ్వకాల తీరు. చెక్ డ్యాంల వద్ద పూడిక తీత పేరిట గత మూడు నాలుగేళ్లుగా సాగుతున్న వ్యాపారం గురించి వింటే ముక్కున వేలేసుకోవలిసిందే. అధికారయంత్రాంగం ఇచ్చే నివేదికల ఆధారంగా జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం రీచుల ఏర్పాటు కోసం నిర్ణయం కూడా తీసేసుకుంది.

రీచులు ఇలా…

కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మీదుగా ప్రవహిస్తున్న మానేరు నది మంథని సమీపంలోని ఆరెంద మల్లారం సమీపంలో గోదావరి నదిలో కలుస్తోంది. అయితే మానేరు నదిలో పలుచోట్ల చెక్ డ్యాంలు నిర్మాణం చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కొన్ని చోట్ల నిర్మించగా అవి కొట్టుకపోయాయని అప్పట్లోనే ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. చెక్ డ్యాంల నిర్మాణం సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఇసుక మేటలు వేసినట్టుగా గుర్తించినట్టయితే ఆ మేరకు ఇసుక తొలగించాలన్న ప్రతిపాదనలు కూడా చేసే అవకాశం ఉంటుంది. కానీ కరీంనగర్ జిల్లా మానకొండూరు, వీణవంక మండలాల్లోని ఇసుక తొలగించాలన్న ప్రతిపాదనలు 2022 నుండి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ లెక్కన మానేరు నదిలో నిర్మించే చెక్ డ్యాంల వద్ద ఏ స్థాయిలో ఇసుక మేటలు వేసిందో అంతుయచిక్కకుండా పోతోంది. ఇప్పటికే పలు మార్లు మానేరు నదిలో పూడికతీత పనుల్లో భాగంగా ఇసుక తీయాల్సి ఉందన్న ఉత్తర్వులు జారీ చేశారు. రీచుల్లో ఇసుక తొలగించేందుకు 2022లో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా నేటికీ పూడికతీతకు అనుమతులు ఇస్తూనే ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరో ఉత్తర్వులు…

అయితే కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల తాజాగా ఇసుక రీచుల నిర్వహణ కోసం DLSC ఆమోదం తెలిపింది. ఇందులో ఏ చెక్ డ్యాం పరిధిలో ఎంత ఇసుక తీయాలో కూడా ప్రతిపాదలు చేసింది. ఇరిగేషన్ అధికారులు చేసిన ప్రతిపాదనలు, జాయింట్ ఇన్స్ పెక్షన్ రిపోర్టు, ప్రభుత్వం ఇచ్చిన జీఓల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రొసిడింగులో పేర్కొన్నారు.

1: G.O.Ms. No. 3, Ind. & Comm. (M.1) Dept, Dt: 08.01.2015.
2: G.O.Ms. No. 15, Ind. & Comm. (M.1) Dept, Dt: 19.02.2015.
3: G.O.Ms. No. 54, Ind. & Comm. (M.1) Dept, Dt: 26.09.2016.
4: Lr.No.EE/ID.No.4/MNT/DB/HD/120/M, dt. 11-04-2025 of the Executive Engineer, Irrigation Division No.4, Manthani, Peddapally.
5: Joint inspection reports of the de-siltation areas falling in Manair River various villages of Manakondur, Veenavanka Karimnagar District, dt. 21.03-2025 ΤΟ 23-03-2025 Mandals,
6: District Level Sand Committee Meeting held on 11-04-2022 ఆనుసరించి తాజాగా ఇసుక రీచుల ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్నామని జిల్లా అధికారులు ఇచ్చిన ప్రొసిడింగ్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో పేర్కొన్న అంశాలను బట్టి… Proceedings No: 274/Sand/TSMDC/2022 అని నెంబర్ రాసి ఉన్న ఈ ఉత్తర్వుల్లో Dated: తేది లేకుండానే .4.2025 అని ఉంది. మార్చి 21 నుండి మార్చి 23, 2025 వరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు, వీణవంక మండలాల్లో జాయింట్ ఇన్స్ పెక్షన్ చేసి పూడిక తీత ప్రాంతాలను గుర్తించి ఇచ్చిన నివేదికల ఆధారంగా ఇసుక రీచులకు అనుమతి ఇచ్చినట్టుగా ఈ ఉత్వర్వులో పేర్కొన్నారు. 11.04.2022లో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తాజా ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టుగా కూడా వెల్లడించారు.

నివేదిక అలా…

కరీంనగర్ జిల్లా మానకొండూరు, వీణవంక మండలాల్లోని ఎనిమిది ప్రాంతాలను గుర్తించినప్పటికీ ఐదు చోట్ల మాత్రమే ఇసుక సేకరించాలని కరీంనగర్ DLSC నిర్ణయం తీసుకుంది. ఇందులో మానకొండూరు మండలం ఊటూరు 2, ఊటూరు 1, వీణవంక మండలంలోని చల్లూరు, మల్లారెడ్డిపల్లి, కొండపాక, పోతిరెడ్డిపల్లిలలో ఇసుక మేటలు వేసిందని పూడిక తీత కోసం రీచులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ఇందులో అత్యంత విచిత్రంగా చోటు చేసుకున్న పరిణామం ఏంటంటే..? ఇరిగేషన్ ఆధర్యంలో నిర్మాణం జరిగిన లేదా జరుగుతున్న చెక్ డ్యాంల వద్ద పూడిక తీయాలన్న నిర్ణయం మాత్రం జాయింట్ ఇన్స్ పెక్షన్ ద్వారా ముందుగా గుర్తించారు. ఆ తరువాత నీటి పారుదల విభాగం అదికారులు ఇసుక తొలగించాలని ప్రతిపాదించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు, వీణవంక మండలాల్లోని మానేరు నదిలో పూడిక తీత చేపట్టేందుకు మార్చి, 21, 2025 నుండి మార్చి, 23, 2025 వరకు Joint inspection జరిపి ఇచ్చిన నివేదికను DLSC పరిగణనలోకి తీసుకుందని పేర్కొంది. మరోవైపున ఇరిగేషన్ పెద్దపల్లి జిల్లా మంథని ఈఈ 11-04-2025 నివేదిక ఇచ్చారని పేర్కొంది. నీటి పారుదల శాఖ అధికారులు ఇసుక మేటలు వేశాయని, పూడికతీత చేపట్టాలన్న ప్రతిపాదన చేయకముందే Joint inspection నిర్వహించారని స్పష్టం అవుతోంది. ఒక వేళ ఇరిగేషన్ అధికారులు కూడా Joint inspection కమిటీలో ఉన్నట్టయితే ప్రత్యేకంగా మంథని డివిజన్ ఈఈ కార్యాలయం నుండి మరో నివేదిక తెప్పించుకోవలసిన అవసరం కూడా లేదని తెలుస్తోంది. ఒకవేళ ఇసుక మేటలు వేసినట్టుగా Joint inspection టీమ్ సూచించినట్టయితే అందుకు సంబంధించిన సమగ్ర వివరాలపై ఇరిగేషన్ అధికారులు అధ్యయనం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది.

అటు నుండి నిర్మాణాలు…

మానేరు నదిలో పెద్దపల్లి ఇరిగేషన్ అధికారులు చేపడుతున్న చెక్ డ్యాంల వద్ద ఇసుక మేటలు వేసినట్టుగా గుర్తించిన అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు చేశారు. ఇందుకు అనుగుణంగా కరీంనగర్ జిల్లా సాండ్ కమిటీ మానకొండూరు, వీణవంక మండలాల్లో ఇసుక రీచుల నిర్వహణ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్ నంబర్ 4 ఈఈ కార్యాలయం నుండి ఇసుక మేటలు వేసినట్టుగా వచ్చిన లేఖ ఆధారంగా రీచులకు కరీంనగర్ జిల్లా కమిటీ ఆమోదం తెలిపింది. అయితే మంథని డివిజన్ నంబర్ 4 ఈఈ కార్యాలయం నుండి వచ్చిన ప్రతిపాదనల్లో మానేరు నదిలో చెక్ డ్యాంల నిర్మాణ ప్రతిపాదత స్థలంలో ఎంతమేర ఇసుక మేటలు వేసింది అన్న వివరాలు ఉన్నాయా లేవా అన్న విషయంపై స్పష్టత రావల్సి ఉంది. మానేరు నది కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల పరిధిలో ప్రవహిస్తున్నందున ఇసుక మేటలు వేసినట్టుగా రెండు జిల్లాల ఇరిగేషన్ అధికారులు నివేదికలు ఇచ్చారా లేక పెద్దపల్లి జిల్లా అధికారుల నివేదిక ఆధారంగానే రీచుల నిర్వహాణ కోసం క్లియరెన్స్ ఇచ్చారా అన్న విషయం తేలాల్సి ఉంది. రెండు జిల్లాల పరిధిలో జరుగుతున్న చెక్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక మేటలు ఎంత ఎత్తులో వేశాయి, ఎంత క్వాంటిటీ ఇసుక పేరకపోయింది, ఎంత లోతు వరకు ఇసుక తీయాల్సి ఉంటుంది అన్న వివరాలపై కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల ఇరిగేషన్ అధికారులు నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది. నదిలో నీటి ప్రవాహం కారణంగా ఇసుక అన్ని చోట్ల ఒకే ఎత్తున మేటలు వేసే అవకాశం ఉండనందున ఎక్కడ ఎంత మేర ఇసుక తీయాల్సి ఉంటుందన్న విషయంపై స్పష్టత ఖచ్చితంగా ఉండాల్సిందేనని స్పష్టం అవుతోంది. ఒకవేళ పెద్దపల్లి జిల్లా నీటిపారుదల అధికారుల నివేదిక ఆధారంగానే ఇసుక రీచుల నిర్వహణ కోసం కరీంనగర్ జిల్లా సాండ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టయితే పెద్దపల్లి జిల్లా DLSCతో సంబంధం లేకుండా ఆ జిల్లా అధికారులు కరీంనగర్ జిల్లా అధికారులకు ప్రతిపాదనలు ఎలా పంపిస్తారన్నది కూడా మిస్టరీగా మారింది.

అక్కడ అలా…

గోదావరి తీరంలో కమర్షియల్ ఇసుక రీచులను నిర్వహిస్తున్న TGMDC శివారు ప్రాంతాలను హద్దులు చేసుకుని వేర్వేరుగా రీచుల నిర్వహాణ కోసం అనుమతులు ఇచ్చింది. కానీ మానేరు నదిలో మాత్రం రెండు జిల్లాలకు కలిపి ఒకే రీచు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం విచిత్రంగా ఉంది. ఒక వేళ ఇసుక మేటలు రెండు జిల్లాల పరిధిలో వేసినట్టయితే రెండు జిల్లాల సాండ్ కమిటీలు వేర్వేరుగా ఇసుక రీచులను ఏర్పాటు చేయించే అవకాశం ఉంటుంది. పెద్దపల్లి జిల్లా ఇరిగేషన్ అధికారుల ప్రతిపాదనలకు కరీంనగర్ జిల్లా సాండ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రెండు జిల్లాల ఇసుక కమిటీలు వేర్వేరుగా రీచుల నిర్వహణ కోసం అనుమతులు ఇచ్చినట్టయితే ప్రభుత్వానికి కూడా అదనపు ఆదాయం వచ్చే అవకాశం లేకపోలేదు.  దీంతో పొంతనలేని రెఫరెన్స్ లతో కరీంనగర్ జిల్లా ఇసుక రీచుల నిర్వహాణ కోసం నిర్ణయం తీసుకున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఈ విషయంలో ఉన్నతాధికారులకు సవివరంగా చెప్పకుండా కమిటీ తీర్మానాలు చేయించారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా 2022లో తీసిన ప్రొసిడింగ్ నంబర్ వేశారు కానీ తేది మాత్రం వేయకపోవడం గమనార్హం. తాజాగా తీసిన ప్రొసిడింగ్స్ కు అప్పటి ఉత్తర్వుల ఆధారం చేసుకోవాలని, అప్పటి ఉత్తర్వుల నంబర్లు వేయడం ఏంటన్నది అంతుచిక్కకుండా పోయింది. చెక్ డ్యాం ఎగువ ప్రాంతంలో 350 మీటర్ల వరకు, దిగువ ప్రాంతంలో 500 మీటర్ల దూరం వరకు మాత్రమే ఇసుక ఇసుక తీయాలని ప్రతిపాదించారు. అలాగే మానేరు నది బఫర్ జోన్ కు 15 మీటర్ల దూరం వరకు మాత్రమే ఇసుక తవ్వాకలు జరపాలని ఉంది. ఈ లెక్కన చెక్ డ్యాం నిర్మాణం రెండు జిల్లాల పరిధిలో జరగనుంది. మానేరు నది మానకొండూరు, వీణవంక మండలాల్లో దాదాపు 500 మీటర్ల నుండి కిలోమీటరు వరకు మానేరు నది విస్తరించి ఉంటుంది. కానీ కొత్తగా ఇసుక సేకరిస్తున్న రీచుల వద్ద 15 మీటర్ల బఫర్ జోన్ వరకే తవ్వకాలు జరపాలని పేర్కొన్నారు. మిగతా ప్రాంతంలో వేసిన ఇసుక మేటలను ఎలా తొలగిస్తారన్నదే అధికారులకే తెలియాల్సి ఉంది. చెక్ డ్యాం నిర్మాణం మానేరు నది ప్రవహిస్తున్న ప్రాంతమంతా చేపడతారు కానీ 15 మీటర్ల వరకు అయితే కాదన్నది వాస్తవం అలాంటప్పుడు అధికారులు నిబంధనలు విధించిన నిబంధనల వల్ల నది ప్రాంతమంతా ఏర్పడిన ఇసుక మేటలు తొలిగిపోయే అవకాశం అయితే లేదు కదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. మరో వైపున పెద్దపల్లి జిల్లా ఇరిగేషన్ అధికారులు నివేదిక ఆధారంగా పూడికతీత చెప్పట్టినట్టయితే కరీంనగర్ జిల్లా పరిధిలోని 15 మీటర్ల వరకే ఇసుక తొలగించాలన్న నిబంధనను ఎలా అమలు చేస్తారోనన్నది కూడా విచిత్రంగా ఉంది. కరీంనగర్ జిల్లా పరిధిలో ఇసుక మేటల గురించి ఈ జిల్లా ఇరిగేషన్ అధికారుల నివేదికలు కూడా ఖచ్చితంగా అవసరమని తాజాగా విడుదల అయిన ప్రొసిడింగ్స్ లో విధించిన నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే మానేరు నదికి ఇరువైపులా 15 మీటర్ల బఫర్ జోన వరకే ఇసుక తవ్వకాలు జరిపినట్టయితే మిగతా ప్రాంతం పరిస్థితి ఏంటన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. 

You cannot copy content of this page