దిశ దశ, కరీంనగర్:
డిసిల్ట్రేషన్ తెలంగాణ రాష్ట్రంలో నది తీర ప్రాంతాల్లో వినిపిస్తున్న ఏకైక పదం. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టిన చెక్ డ్యాం నిర్మాణ ప్రతిపాదిత స్థలాల్లో ఇసుక మేటలు వేడయంతో అక్కడ డిసిల్ట్రేషన్ కోసం ఇసుక తరలించాల్సిన ఆవశ్యకత ఉందని ఇరిగేషన్ అధికారులు నివేదికలు ఇస్తున్నారు. దీంతో గత ఐదారు ఏండ్లుగా తెలంగాణాలోని కొన్ని నదుల్లో డిసిల్ట్రేషన్ లో భాగంగా ఆయా చోట్ల ఇసుక వ్యాపారం జరుగుతోంది. ఇరిగేషన్ అధికారులు, Joint inspection టీమ్స్ సర్వే చేయడం, జిల్లా స్థాయి సాండ్ కమిటీ తీర్మానం చేసి రీచుల నిర్వహించాలని TGMDCకి ప్రతిపాదనలు పంపిస్తున్నారు. ఈ మేరకు ఇసుక రీచులను తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ నిర్వహిస్తూ ఇసుక వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. అయితే ఇందులో కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిలో గతంలో చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. వీటిలో కొన్ని చెక్ డ్యాంలు కొట్టుకపోయాయి. అయితే ఆయా ప్రాంతాల్లో ఇసుక మేటలను తొలగించేందుకు రీచులను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు రికార్డుల్లో చెప్తున్నారు. నిర్మాణం అయిన చెక్ డ్యాంల వద్ద అయినా కొత్తగా నిర్మించాల్సిన ప్రతిపాదిత ప్రాంతంలో అయినా ఇసుక తొలగించేందుకు డిసిల్ట్రేషన్ చేపట్టాలని అధికారుల ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే కొత్తగా నిర్మించిన, నిర్మిస్తున్న చెక్ డ్యాంల వద్ద ఏళ్లుగా డిసిల్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించాల్సి రావడం విచిత్రం.
మరి అక్కడో…
రాష్ట్రంలో దశాబ్దాల క్రితమే ప్రాజెక్టులు నిర్మాణం జరిగిన సంగతి తెలిసిందే. సింగూరు, శ్రీరాంసాగర్, ఎల్లపంల్లి, మిడ్ మానేరు లోయర్ మానేరు, దేవాదుల వంటి ఎన్నో ప్రాజెక్టులు, డ్యాములు సాగు, తాగు నీటి అవసరాలను తీర్చడంతో పాటు జల విద్యుత్ కేంద్రాలకు కూడా నీరందిస్తున్నాయి. అయితే 1970వ దశాబ్దం నుండి నిర్మాణం జరిగిన ఆయా ప్రాజెక్టుల్లో డిసిల్ట్రేషన్ చేపట్టిన దాఖాలు అయితే ఇంతవరకు లేవు. తాజాగా కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యాంలో మాత్రం డిసిల్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించాలన్న ప్రతిపాదనలు కొనసాగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కానీ మానేరు నదిలోని చెక్ డ్యాంలలో మాత్రం తొలినాళ్లలోనే డిసిల్ట్రేషన్ కొనసాగించాలని ఇరిగేషన్ విభాగానికి చెందిన ఇంజీనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు చేయడం విచిత్రంగా ఉంది. ఇందుకు అనుగుణంగానే డిసిల్ట్రేషన్ చేపట్టేందుకు ప్రత్యేకంగా ఇసుక రీచులను ఏర్పాటు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దశాబ్దాల క్రితం నిర్మించిన డ్యాములు, ప్రాజెక్టుల్లో కంటే మానేరు నదిలో నిర్మిస్తున్న లేదా నిర్మించిన చెక్ డ్యాంల వద్ద మాత్రం మూడు నాలుగేళ్లుగా విడుతల వారిగా పూడికతీత పేరిట ఇసక తవ్వకాలు జరుపుతుండడం విస్మయం కల్గిస్తోంది. ఈ లెక్కన తెలంగాణలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న డ్యాములు, ప్రాజెక్టుల వద్ద ఏ స్థాయిలో సిల్ట్ పేరుకపోయి ఉంటుందోనన్న చర్చ కూడా సాగుతోంది.
కమర్షియల్..?
ఇకపోతే డిసిల్ట్రేషన్ పేరిట ఇసుక తవ్వకాలకు అనుమతిస్తున్న అధికారులు TGMDC ద్వారా అమ్మకాలు జరిపిస్తున్నారు. కమర్షియల్ క్వారీల మాదిరిగా ఇసుక రీచులను కొనసాగించడం అనేది నిబంధనలకు విరుద్దమని తెలుస్తోంది. పెద్దపల్లి ఇసుక రీచుల విషయంలో కూడా అధికారులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కు ఇచ్చిన నివేదికలో కూడా కమర్షియల్ అవసరాలకు ఈ ఇసుకను వినియోగించడం లేదని వెల్లడించారు. కానీ ఇప్పుడు, అప్పుడు కూడా డిసిల్ట్రేషన్ పేరిట ఇసుక క్రయ విక్రయాల తంతు కొనసాగిస్తూనే ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.