దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నాయకులు ఒకరినొకరు తోసుకోవడంతో పాటు చెప్పులు కూడా విసురుకున్నారు. ఆందోళనలు చేయి దాటిపోయే పరిస్థితికి చేరడంతో రంగంలోకి దిగిన ఎస్పీ మహేష్ బి గీతే. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసి పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నారు.


బీఆర్ఎస్ నిరసన…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కౌంటర్ గా బీజేపీ నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బండి సంజయ్ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నినాదాలు ఇస్తున్న క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆగ్రహంతో ఊగిపోయిన ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులను అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మోహరించారు. ఎస్పీ మహేష్ బీ గీతే కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. చివరకు ఇరు పార్టీల నాయకులను పోలీస్ స్టేషన్ లకు తరలించారు.


