దిశ దశ, అంతర్జాతీయం:
స్వరాష్ట్ర కల సాకారమై 12వ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో తెలంగాణ బిడ్డలు ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులంతా ఒక చోటకు చేరి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఉపాధి కోసం వెల్లిన వారంతా ఒక చోటకు చేరి తెలంగాణ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శిస్తూ జన్మభూమిపై ఉన్న మమకారాన్ని చూపిస్తున్నారు. అబుదాబిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని అబుదాబిలోని ఇండియన్ ఎంబసీ వేదికగా ఆవిర్భావ దినోత్సవాలు వైభవంగా నిర్వహించారు. తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్, అబుదాబి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి కాన్సూలర్ ప్రేమ్ చంద్, సెకండ్ సెక్రటరీ కుమారి ఆయుషి సుతారియాలు హాజరయ్యారు. తెలంగాణకు చెందిన నేటితరం భారత, యూఏఈ జాతీయ గీతాలాపనతో తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని ఆలపించిన తీరు సభికులను ఆకట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధర్యంలో అబుదాబి చేరుకున్న ధరావత్ రాజ్ కుమార్ బృందం పేరిణి శివ తాండవం, గుస్సాడి నృత్యం, పోతరాజుల వేషాలతో పాటు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే వివిధ రకాల కళలను ప్రదర్శించారు. తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు పావని, అర్చన, లక్ష్మీలు తెలంగాణ కళలను చిత్ర ప్రదర్శన ద్వారా ప్రదర్శించి తమలోని కళాత్మకతను చూపించారు. ఈ సందర్భంగా ఎంబసీ అదికారులు అబుదాబి ఫ్రెండ్స్ అసోయేషన్ ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్య నిర్వాహకుడు రాజా శ్రీనివాస రావు పాల్గొన్నారు.