పోలీస్ బాస్ గా శివధర్ రెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం…

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ గా 1994 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ శివధర్ రెడ్డిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. డీజీపీ జితేందర్ ఈ నెల 30న రిటైర్ కానున్న నేపథ్యంలో ఆయన స్థానంలో శివధర్ రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. ప్రస్తుతం ఇంటలీజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ ఎల్ బి పూర్తి చేసిన శివధర్ రెడ్డి ఐపీఎస్ కు సెలక్ట్ అయిన తరువాత ఏపీలోని చింతలపల్లి ఏఎస్పీగా పని చేశారు. అడిషనల్ ఎస్పీగా గ్రేహ్రౌండ్స్, స్క్వాడ్రన్ కమాండర్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన బెల్లంపల్లిలో కూడా విధులు నిర్వర్తించారు. శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా పని చేశారు. ఆ తరువాత సౌత్ జోన్ డీసీపీగా పని చేసిన ఆయన స్పెషల్ ఇంటలీజెన్స్ బ్యూరో (sib)లో పని చేసిన అనంతరం ఐక్యరాజ్య సమితి సంరక్షణలో ఉండే కోసావాలో యూనైటెడ్ నేషన్స్ మిషన్ లో కూడా పని చేశారు. విశాఖపట్నం సీపీగా, SIB చీఫ్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించిన శివధర్ రెడ్డి రాష్ట్ర విభజన తరువాత తెలంగాణాకు అలాట్ అయ్యారు. ప్రస్తుతం ఇంటలీజెన్స్ చీఫ్ గా పని చేసిన శివధర్ రెడ్డిని డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అక్టోబర్ 1 నుండి కొత్త బాధ్యతల్లో సేవలు అందించనున్నారు.