ఏసీబీ నివేదికతో చర్యలకు సిఫార్సు
దిశ దశ, వేములవాడ:
దక్షిణ కాశీగా ప్రసిద్ది గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పని చేస్తున్న పలువురిపై చర్యలు తీసుకునేందుకు అవసరమైన దస్త్రం కదులుతోంది. ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ కార్యాలయం నుండి ఇందుకు సంబంధించిన లేఖ విడుదల అయింది.
పరిపాలన లోపాలు…
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గత సంవత్సరం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 2024 ఆగస్టు 22న అవినీతి నిరోధక శాఖకు చెందిన అధికారుల బృందం రాజన్న ఆలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో పరిపాలన పరమైన లోపాలను గమనించిన ఏసీబీ అధికారులు ఈ మేరకు నివేదికలు పంపించారు. C.NO: 26/DES-KNR/2024, 29.03.2025న ఏసీబీ లేఖ రాసింది. ఈ మేరకు Memo no: 10270/vig.IV(1)/2025, 29.05.2029న జారీ అయిన ఈ లేఖ దేవాదాయ డైరక్టర్ కార్యాలయానికి చేరింది. 3 (1) (2) (3) (5) of TCS (conduct) 1964 ప్రకారం నిబంధనలు అతిక్రమించిన వేములవాడ రాజన్న ఆలయ ఈఓతో పాటు పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఈ లేఖలో ఆలయ ఈఓ వినోద్ రెడ్డి, రికార్డ్ అసిస్టెంట్లు ఎన్ సునీల్, టి అజయ్, లడ్డూ కౌంటర్ ఇంఛార్జి బి లక్ష్మారెడ్డి, సూపరింటిండెంట్లు గుండి నర్సింహ మూర్తి, వారి నర్సయ్య, జూనియర్ అసిస్టెంట్ ఏలేటి నరేందర్ లపై శాఖా పరంగా చర్యలు తీసుకోవాలని ఆ మెమోలో స్పష్టం చేశారు.