Maoist party: ఉగ్రవాదులపై లేని పగ… ఉద్యమకారులపై ఎందుకు..?

మావోయిస్టు నేత తమ్ముని కూతురి ప్రశ్న…

దిశ దశ, జగిత్యాల:

అజ్ఞాతంలో ఉన్న పెద్దనాన్నకు తమ్ముని కూతురు లేఖ రాశారు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లోనైనా అడవులు వదిలి కుటుంబంతో కలిసి ఉండేందుకు బయటకు రండి. మీ ప్రస్తావేన వచ్చిన ప్రతిసారి నాలో తెలియని గర్వ, బాధ కలుగుతుంటాయి. అంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ కి ఆయన సోదరుడు గంగాధర్ కూతురు తిపిరి సుమ రాసిన లేఖ నెట్టింట్ వైరల్ అవుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్లలోని అంబేడ్కర్ నగర్ కు చెందిన తిపిరి తిరుపతి పీపుల్స్ వార్ ఉద్యమ ప్రస్తానం నుండి అడవి బాట పట్టారు. విప్లవ పంథాలో దశాబ్దాల కాలంగా ముందుకు సాగుతున్న తిరుపతి ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్నారు. మావోయిస్టు పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన తిపిరి తిరుపతి గురించి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది చత్తీస్ గడ్ లోని నారాయణపూర్ కీకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబల్ల కేశవరావు అలియాస్ బసవరాజ్, ఉరఫ్ బీఆర్ దాదా మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ ఎవరు అవుతారోనన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే ఈ సారి కూడా తెలుగు వారే ఈ బాధ్యతల్లో కొనసాగుతరాన్న వాదనలు బలంగా వినిపించాయి. తెరపైకి వచ్చిన పేర్లలో తిపిరి తిరుపతి పేరు కూడా ప్రముఖంగా వినిపించడంతో ఆయన గురించి తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేఫథ్యంలోనే ఆయన తమ్ముని కూతురు సుమ రాసిన లేఖ సరికొత్త చర్చకు దారి తీస్తోంది. సుమ రాసిన లేఖలో తిరుపతి ఎలా ఉన్నారోనన్న ఆందోళనతో పాటు ఆయన ఇంటికి రావాలని ఆకాంక్షించారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న సుమ రాసిన ఈ లేఖలో సమాజ నిర్మాణం వెళ్లిన పెద్దనాన్న మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టం దేనికని అనుకుంటే మీరు ఎంతో గెలిచారు, ఎన్నో సాధించారని అనిపిస్తోందన్నారు. ఆపరేషన్ కగార్ ఎందుకో నాకు అర్థం కావడం లేదు… కన్నోళ్లను విడిచి కనమరుగైపయారు… పేదోడి కష్టాలు తీరుద్దామని ఊరుని, పేరుని వదిలి వెళ్లినారు… ఆనందాలు వదులుకుని అడవి బాట పట్టినారు… తప్పేం చేశారని ఆపరేషన్ కగార్ చేపట్టారు..? ఉన్నత చదువులు వదిలి ఉనికి మనిషి అయినందుకా..? దౌర్జన్యం చేసే దొరలను దారిలో పెట్టినందుకా..? కార్లు, బంగ్లాలు వదిలి కారడవుల్లో ఉంటున్నందుకా..? సంతోషాలు వదిలి సాధిస్తామని వెల్లినందుకా..? ఏమి తెలుసని వాళ్ల గురించి..? ఉద్యమాన్ని ఎంచుకోవడానికి కారణాలు ఈ రాజులు, రాజకీయాలు. ఉగ్రవాదుల మీద లేని ఉద్యమ కారుల మీదు ఎందుకు..? ఆపరేషన్ కగార్ పేరిట ఎన్ కౌంటర్ చేయడంతో ఎన్నో కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి… మన దేశంలోకి పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుండి చొరబడి మనపౌరులను చంపుతున్న వారిపై కన్నా మనదేశపు బిడ్డలైన మావోయిస్టులపైనే ఎక్కువ ఆపరేషన్లు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదంటూ తిపిరి సుమ ఆ లేఖలో అస్త్రాలను సంధించారు. మావోయిస్టులను దారుణంగా చంపి సంబరాలు చేసుకుంటూ స్వీట్స్ పంచుకుంటున్న దాన్ని చూస్తుంటే ఎంతవరకు ఇది సమంజసమో అర్థం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో నన్ను చాలా బాధ కల్గిస్తోంది, ఇక వస్తారు, ఇక వస్తారు అని ఇంటి గుమ్మంలో ఇంకా మీ కోసమే ఎదరు చూస్తున్న మన కుటుంబం మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అంటూ ముగించారు సుమ తిపిరి.

You cannot copy content of this page