kaleshwaram Sand: గోదావరిని మించిన మానేరు..! ఇసుక సేకరణ ఇంకెన్నేళ్లు..?

దిశ దశ, హుజురాబాద్:

ఇసుక సేకరణ విషయంలో కాళేశ్వరం మీదుగా ప్రవహిస్తున్న గోదావరి రికార్డులను మానేరు నది బద్దలు కొడుతున్నట్టుగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడితే… మానేరు నదిపై ఇసుక సేకరణ విషయంలో ఆ రికార్డులను బ్రేక్ చేస్తున్నట్టుగా ఉంది. ఆలోచన వచ్చిందే సరి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్న తీరు వల్ల అబాసుపాలు అవుతున్నామన్న  విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. దీంతో ఓ కారణం చూపించి ఇసుక తవ్వకాలు జరిపించడానికే మొగ్గు చూపుతున్నారే తప్ప అక్కడ నిర్మాణాల విషయాలను మాత్రం పట్టించుకోవడం లేదు.

కాళేశ్వరం అలా…

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లల వద్ద బ్యారేజీలను నిర్మించారు. 2016 మేలో ఈ మేరకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 2019లో జూన్, జులై మాసాల్లో వీటిని లాంఛనంగా ప్రారంభించారు. అయితే బ్యారేజీల నిర్మాణ సమయంలో కొంతకాలం డిసిల్ట్రేషన్ పేరిట ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. TGMDC ద్వారా ప్రత్యేకంగా రీచులను ఏర్పాటు చేసి పూడికతీత నిర్వహించారు. మహదేవపూర్ మండలం మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారీజీకి 84 గేట్లు ఏర్పాటు చేయగా ఇందులో 16 టీఎంసీల నీటిని నిలువ ఉంచాలని ఇంజనీర్లు నిర్ణయించారు. అన్నారం బ్యారేజీకి 66 గేట్లను నిర్మించగా 10.87 టీఎంసీల నీటిని నిలువ ఉంచాలని, సుందిళ్ల బ్యారేజీకి 74 గేట్లు నిర్మించిన ఇంజనీర్లు 8.83 టీఎంసీల నీటిని నిలువ ఉంచాలని నిర్ణయించారు 2016లో నిర్మాణం ప్రారంభించిన 2019 నాటికి పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు నుండి డిసిల్ట్రేషన్ పేరిట ఇసుక తరలింపు కోసం కొంత సమయం తీసుకున్నారు.

మానేరుపై ఇలా…

మానేరు నదిపై పలు చోట్ల చెక్ డ్యాంలు నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో కొన్ని నిర్మాణ దశలో ఉన్నప్పుడే వర్షాకాలం రావడం ఉధృతంగా వచ్చిన వరదల్లో కొట్టుకపోవడం జరిగాయి. అయితే మానేరు నదిపై చెక్ డ్యాం ప్రతిపాదిత ప్రాంతాల్లో ఇసుక తొలగించాల్సి ఉందని డిసిల్ట్రేషన్ చేపట్టాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పలు చోట్ల ఇసుక రీచులను ఏర్పాటు చేసింది. ఇరిగేషన్ అధికారులు డిసిల్ట్రేషన్ కోసం ప్రతిపాదనలు పంపించడం, ఆయా జిల్లాల సాండ్ కమిటీలు ఆమోదం తెలిపి TGMDCకి ప్రతిపాదనలు పంపించడంతో రీచుల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇదే మనేరు నదిపై కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ రీచులు, మరికొన్ని చోట్ల ప్రభుత్వం చేపట్టే నిర్మాణాల కోసం ఇసుక తరలించేందుకు కూడా కొన్ని రీచులను ఏర్పాటు చేశారు. అయితే ఇందులో డిసిల్ట్రేషన్ పేరిట ఏళ్లుగా ఇసుక రీచులు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఏటేటా తెరపైకి వస్తుండడం గమనార్హం. టీఎంసీల్లో నీటిని నిలువ ఉంచే కాళేశ్వరం బ్యారేజీల వద్ద డిసిల్ట్రేషన్ పనులు స్వల్పకాలంలోనే ముగిస్తే గోదావరి నదికి ఉప నది అయిన మానేరుపై నిర్మిస్తున్న చెక్ డ్యాంల వద్ద మాత్రం  పూడికతీత పేరిట ఇసుక తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. నామమాత్రంగా నిలువ ఉండే చెక్ డ్యాంల వద్ద ఇసుక మేటలు ఎంతమేర ఉన్నాయి..? లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుక తరలించినా తరగకపోవడానికి కారణం ఏంటన్నదే మిస్టరీగా మారింది. తాజాగా  కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు, వీణవంక మండలాల్లోని ఐదు చోట్ల డిసిల్ట్రేషన్ కోసం ఇసుక రీచులను అనుమతించడం విశేషం. కోటి ఎకరాల మాగాణికి నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద డిసిల్ట్రేషన్ ఎంత కాలం కొనసాగింది..? మానేరు చెక్ డ్యాంల వద్ద చేపడుతున్న పూడికతీత ఎంతకాలంగా సాగుతుందో అర్థం చేసుకోవల్సిన అవసరం ఉంది. ఆయా చెక్ డ్యాంల వద్ద నీటి నిలువ ఎంతమేర ఉంటుందో కూడా పోల్చుకోవల్సిన అవసరం కూడా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

లాజిక్కు ఇదే మరి..?

ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద పూడికతీత పనులు చేపట్టిన ప్రభుత్వం నిర్మాణాలను కూడా పూర్తి చేసింది. కిలోమీటర్ల మేర వెడల్పు ఉన్న గోదావరి నదిపై బ్యారేజీల నిర్మాణం మూడేళ్లలోనే పూర్తయ్యాయి. కానీ కరీంనగర్, పెద్దపల్లి జిల్లా మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిపై మాత్రం చెక్ డ్యాంల నిర్మాణం మాట దేవుడెరుగు, డిసిల్ట్రేషన్ తంతు మాత్రం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. వరదల్లో చెక్ డ్యాంలు కొట్టుకపోయిన తరువాత తిరిగి వాటిని నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారా లేదా అనేది సంబంధిత ఇంజనీరింగ్ విభాగానికే తెలియాలి. కానీ చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించిన మానేరు నదిలో మాత్రం పూడికతీత పేరిట ఇసుక తరలింపు కోసం అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉండడం విస్మయం కల్గిస్తోంది. అసలు పూడిక తీత తీయాల్సింది ఎంత..? చెక్ డ్యాం వద్ద నిలువ ఉండే నీరు ఎంత..? ఇసుక మేటలు ఎంతమేర వేశాయి అన్న సాంకేతిక పరమైన అంశాలపై అధికారులు సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారా లేదా అన్నది కూడా అంతు చిక్కకుండా పోతోంది. చకా చకా ప్రతిపాదనలు, అంతే వేగంగా  అనుమతులు, అంతకు మించి స్పీడుతో రీచుల ఏర్పాటు కొనసాగుతున్న తీరు అన్ని వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మానేరు నదిలో  డిసిల్ట్రేషన్ పేరిట ఇసుక తరలింపు కోసం ప్రత్యేకంగా మమకారం ఎందుకు చూపుతున్నారన్న చర్చ స్థానికంగా సాగుతోంది. ఇసుక సేకరణపై వస్తున్న ఆదాయంపై మాత్రమే దృష్టి సారించారా లేక, తమ వారి కోసం డిసిల్ట్రేషన్ బూచి చూపిస్తున్నారా అన్నది అధికార యంత్రాంగానికే తెలియాలి. కానీ మానేరు నదిలో చెక్ డ్యాంల ఊసెత్తకుండా పూడికతీత పేరిట ఇసుక వ్యాపారం చేస్తున్న తీరే అన్ని వర్గాలనూ విస్మయపరుస్తోంది.

You cannot copy content of this page