దిశ దశ, కరీంనగర్:
శిక్షణ ఇచ్చేందుకు వెళ్లిన విద్యాధికారి శిక్షకు గురయ్యారు. తానేదో మాట్లాడే ప్రయత్నం చేసి తలవంపులు కొని తెచ్చుకున్నారు. విద్యార్థులకు సంస్కారవంతమైన విద్యను అందించేందుకు శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులను సుశిక్తులుగా తీర్చిదిద్దే విధంగా ఉపన్యాసాలు ఇవ్వకుండా దారితప్పిన విధంగా ప్రసంగించడం కలకలం లేచింది. జిల్లా విద్యారంగంలోని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మార్గదర్శిగా నిలవాల్సిన డీఈఓ జనార్థన్ రావు చేసిన ప్రసంగంపై టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. డీఈఓ ప్రసంగం బయటకు రావడంతో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థి సంఘాలు కూడా కూడా అభ్యంతరాలు లేవనెత్తాయి. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఆయనపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు కూడా చేశాయి. దీంతో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి డీఈఓ జనార్దన్ రావుపై వేటు వేయాలని నిర్ణయించారు. టీచర్ ట్రైనింగ్ సందర్భంగా డీఈఓ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహించిన కలెక్టర్ ఆయనను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ ఇంఛార్జి డీఈఓగా డైట్ కాలేజీ ప్రిన్సిపల్ మొండయ్యకు బాధ్యతలు అప్పగించారు.