తెలంగాణ సంస్కృతితో మమేకం…

బోనం సమర్పించిన కరీంనగర్ కలెక్టర్…

దిశ దశ, కరీంనగర్:

తెలంగాణ సంస్కృతి సాంప్రాదాయాలతోనూ ఆ కలెక్టర్ మమేకమయ్యారు.  స్వరాష్ట్రం ఒడిషా అయినా తెలంగాణాలో పని చేస్తున్న ఆమె ఇక్కడి ఆచారాలను పాటించి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆషాడ మాసం పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా కూడా బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి ఘనంగా సాగుతున్న బోనాల వేడుకల్లో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బిడ్డలు అమ్మవారికి సమర్పించినట్టుగానే కలెక్టర్ కూడా బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు. నగరంలోని కోతిరాంపూర్ పోచమ్మ ఆలయంలో ఆదివారం కలెక్టర్ బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ… తెలంగాణ జీవన విధానం తనను ఎంతో ఆకట్టుకుందని, ఆత్మ గౌరవానికి, ఐక్యతకు ఘనమైన చరితకు ప్రతీకగా నిలిచే బోనాల వేడుకల్లో ప్రతి ఒక్కరు ఆనందరంగా పాలుపంచుకుంటున్న తీరు ఆదర్శనీయమన్నారు. జిల్లా ప్రజలందరిపై అమ్మవారి దీవెనలు ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.