మాకు తెలంగాణ రైతుల ప్రయోజనాలే ముఖ్యం

గవర్నర్ తీరును తప్పు పట్టిన మంత్రి గంగుల కమలాకర్

దిశ దశ, కరీంనగర్:

తెలంగాణ రైతుల ప్రయోజనాలే ముఖ్యమని, స్వరాష్ట్రం తరువాతే ఇతర రాష్ట్రాల గురించి ఆలోచిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కరీంగనర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్ పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… కర్ణాటక ఎన్నికలకు తాము డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని, వంద కోట్లు ఇవ్వాలనుకుంటే తెలంగాణ రైతులకు ఇచ్చుకుంటామని స్పష్టం చేశారు. మరో వైపున రాష్ట్ర గవర్నర్ తమిళిసైపై కూడా మంత్రి గంగుల దుయ్యబట్టారు. ఆమె వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయంగా ఉందన్నారు. రాష్ట్ర గవర్నర్ కావాలనే రాజకీయాలు చేస్తున్నారని, ఓ వైపున రాష్ట్ర రైతంగా అకాల వర్షాల బారిన పడి కష్టాలు ఎదుర్కొంటుంటే మీరు రాజకీయాలు చేయడం ఏంటని మంత్రి గంగుల ప్రశ్నించారు. గవర్నర్ రాష్ట్ర రైతాంగాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగిన ఆయన ప్రకృతి బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను ఆదుకునేందుకు కేంద్ర బృందాలు ఎందుకు రాష్ట్రానికి రావడం లేదో చెప్పాలన్నారు.