దిశ దశ, హుజురాబాద్:
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో విషాదం అలముకుంది. సీనియర్ పోలీసు అధికారి గుండెపోటుతో దుర్మరణం చెందారు. పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో డీఎస్పీగా పని చేస్తున్న డీఎస్పీ మహేష్ కొద్ది సేపటి క్రితం హుజురాబాద్ లో మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న మహేష్ శుక్రవారం గుండెపోటుకు గురి కావడంతో మృత్యువాత పడ్డారు. ఆయన సతీమణి వి మాధవి హుజురాబాద్ ఏసీపీగా పని చేస్తున్నారు. హుజురాబాద్ నుండి కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో విధులు నిర్వర్తించేందుకు వెల్తుంటారు. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకున్న డీఎస్పీ మహేష్ ను వెంటనే హుజురాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందని గమనించిన హుజురాబాద్ ఆసుపత్రి డాక్టర్లు గంటకు పైగా సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. మహేష్ మరణించినట్టుగా డాక్టర్లు ధృవీకరించడంతో మృతదేహాన్ని కరీంనగర్ తరలించారు. 1995 బ్యాచ్ కు చెందిన మహేష్ మరణ వార్త పోలీసులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

