జగిత్యాల జిల్లాలో దారుణం…
దిశ దశ, జగిత్యాల:
బ్రతికున్నప్పుడు కుల బహిష్కరణ పేరిట వెలివేశారు… చనిపోయిన తరువాత కూడా అదే పంథంతో బెట్టు చేశారు. మానవతా విలువలకే సవాల్ విసురుతున్న ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ కావడంతో మంటగలసిపోయిన విలువకలకు తార్కాణంగా మారింది. సంఘటనా వివరాల్లోకి వెలితే… జిల్లాలోని బీర్పూర్ మండలం కందనకుంట గ్రామానికి చెందిన ఎదుల రాజేశం కుటుంబాన్ని కొంతకాలం క్రితం కుల బహిష్కరణ చేశారు. అయితే రాజేశం మరణించడంతో అతని అంత్యక్రియల విషయంలోనూ కఠినంగా వ్యవహరించారు. బహిష్కరించిన కుటుంబానికి చెందిన రాజేశం మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించేందుకు కూడా స్థానికులు ముందుకు రాలేదు. చివరకు సమీప గ్రామంలో ఉన్న మృతుని బంధువులు అంత్యక్రియల్లో పాల్గనేందుకు ముందుకు వస్తే కూడా స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులే రాజేశం శవాన్ని పాడెపై మోసుకుంటూ శ్మశాన వాటికకు తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. భర్త శవాన్ని చివరకు ఆయన భార్య కూడా మోయాల్సి వచ్చిందంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. సంబంధం లేని వారి చనిపోతేనే అయ్యో పాపం అంటూ సానుభూతి తెలిపే నేటి సమాజంలో కడసారి చేపట్టాల్సిన తంతు విషయంలో కులస్థులు వ్యవహరించిన తీరు నెటిజన్లను విస్మయపరిచింది. సమస్యకు పరిష్కారం కోసం చొరవ తీసుకోవల్సిన పెద్దలే ఇలా నడుచుకుంటే భావి తరాలకు ఎలాంటి సందేశం ఇస్తున్నామోనన్న కామెంట్లూ వినిపిస్తున్నాయి.

