దేశంలోనే తొలి మహిళా బీసీ కాలేజ్

భూమి పూజ చేసిన మంత్రి గంగుల

దిశ దశ, కరీంనగర్:

దేశంలోనే తొలి బీసీ మహిళా కాలేజీకి కరీంనగర్ వేదిక కానుంది. కరీంనగర్ సమీపంలోని ముగ్దుంపూర్ లో మహాత్మా జ్యోతిబా పూలే వెనకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ పనుల కోసం భూమి పూజ చేశారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ కాలేజీ కోసం 75 ఎకరాల స్థలం అవసరం కాగా ఇప్పటికే 45 ఎకరాలు కెటాయింమని, మరో 30 ఎకరాల స్థలం త్వరలో అలాట్ చేయనున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండే క్లాసులు ప్రారంభించాలన్న లక్ష్యంతో ఉన్నామని రానున్న కాలంలో ఈ కాలేజీని అగ్రికల్చర్ యూనివర్శిటీగా తీర్చిదిద్దనున్నామన్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ విద్య కోసం ఈ ప్రాంత విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ముగ్దుంపూర్ కాలేజీ నిర్మాణంతో ఆ పరిస్థితులకు చెక్ పడబోతున్నాయని గంగుల అన్నారు. డిగ్రీ పూర్తి చేయాలంటే రూ. 25 లక్షల వరకూ డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి ఉండేదని ఇక నుండి బీసీ బిడ్డలకు ఆర్థిక భారం పడకుండా ఉండాలన్న సంకల్పంతో ఉచిత వ్యవసాయ విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకున్నారని మంత్రి వివరించారు. కేవలం మహిళలకు మాత్రమే వ్యవసాయ విద్యను అందించే ఈ కళాశాలలో 80 శాతం బీసీలు, 20 శాతం ఇతరులకు సీట్లు కెటాయించనున్నట్టు మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి రూ. 27 కోట్లతో కాలేజీ భవనాల నిర్మాణం ప్రారంభిస్తామని, కంపౌండ్ వాల్ కు రూ. కోటి. 30 లక్షలు కెటాయించినట్టు తెలిపారు. కాలేజీ నిర్మాణంతో సమీప గ్రామాల రూపు రేఖలు మారనున్నాయని, ఏడాదిలోగా కొత్త భవనాలు కంప్లీట్ చేసి ఇందులోనే తరగతులు బోదించే విధంగా చొరవ తీసుకుంటున్నామన్నారు. రానున్న రోజుల్లో ఈ కాలేజీలో బిఏ, బీకాం, బీఎస్సీ కంప్యూటర్స్, తదితర కోర్సులు కూడా అందుబాటులోకి తీసుకరావాలన్న సంకల్పంతో ఉన్నామని వివరించారు.

భూమిపూజ చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్
BC WOMEN COLLEGEcm kcrLatest NewsMINISTER GANGULAtelangana news