మంథని వాసి భాగస్వామ్యం…
దిశ దశ, కరీంనగర్:
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) తరహాలో తెలంగాణ క్రికెటర్లను ప్రత్యేకంగా ప్రొత్సహించాలని సంకల్పించింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను ఆదరించినట్టయితే వారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కనుందని భావించింది. ఈ మేరకు HCA బిడ్లను ఆహ్వానించగా జిల్లాల వారిగా బిడ్స్ దాఖలు చేసిన యజమనులను ప్రకటించింది. TG20 తొలి ఎడిషన్ లో తెలంగాణకు చెందిన ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి.
వరంగల్… మంథని…
వరంగల్ జిల్లా జట్టుకు ఫ్రాంచైజీని Bain Global Resources Private Limited సంస్థ దక్కించుకుంది. రూ. 7.50 కోట్లకు హక్కులను దక్కించుకున్నఈ సంస్థకు వరుణ్ జూపల్లి, శ్రవణ్ రెడ్డి ముస్కుల ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ జట్టుకు ఆరెంజ్ కలర్ జెర్సీని HCA కెటాయించింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని క్రికెటర్లను ప్రొత్సహించేందుకు త్వరలోనే ఎంపిక ప్రక్రియ ప్రారంభించనున్నారు. TG20లో అద్భుత ప్రతిభ కనబర్చిన క్రికెటర్లకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది. శ్రవణ్ ముస్కుల పెద్దపల్లి జిల్లా మంథనికి నివాసి కావడం గమనార్హం. ఆయన తండ్రి దివంగత ముస్కుల నారాయణ రెడ్డి సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి సేవలందించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడిన శ్రవణ్ రెడ్డి క్రికెటర్లను ప్రొత్సహించాలన్న లక్ష్యంతో TG20 తొలి ఎడిషన్లోకి ఎంటర్ అయ్యారు. మేధావులకు పుట్టినిల్లుగా వాసికెక్కిన మంత్రపురికి చెందిన వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో స్థిరపడిన వారు కూడా ఉన్నారు. అయితే ఏకంగా జట్టు యాజమాన్య హక్కులను సాధించుకున్నది మాత్రం శ్రవణ్ రెడ్డి ముసుకుల కావడం విశేషం.