ప్రజావాణిలో ఆరో తరగతి విద్యార్థి ఫిర్యాదు

దిశ దశ, జగిత్యాల:

ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు షాకిచ్చాడు 13 ఏళ్ల బుడతడు. సిన్సియర్ గా వేదిక వద్దకు వచ్చి ఓ నమస్కారం పెట్టేసి అధికారుల చేతికి వినతి పత్రం అందించాడు. దరఖాస్తు చదివిన అధికారులు సంబంధిత శాఖ అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ లో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఇంతకీ ఆ చిన్నారి ఇచ్చిన దరఖాస్తు ఏంటంటే..?
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్ ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విశ్వంక్ తమ పాఠశాలలో వాష్ రూమ్స్ బాగాలేవని వాటిని వెంటనే బాగు చేయించాలని, తాగునీటి సౌకర్యం కూడా లేనందును విద్యార్థులంతా ఇబ్బంది పడుతున్నామని తమకు సౌకర్యాలు మెరుగు పర్చాలని దరఖాస్తులో కోరాడు. ఆరో తరగతి చదువుతున్న విశ్వంక్ నేరుగా కలెక్టరేట్ కు వచ్చి కంప్లైంట్ చేయడం చూసిన అధికారులు, ఫిర్యాదుదారులు ఆశ్యర్యపోయారు. చివరకు అధికారులు విశ్వంక్ కోరినట్టుగా ఓల్డ్ హై స్కూల్ పాఠశాలలో సౌకర్యాలు మెరుగు పర్చేందుకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.

EDUCATIONJAGITHYAL NEWSLatest NewsPRAJAVANItelangana news