చైన్ స్నాచర్ ను పట్టుకున్న మహిళ

బైక్ పై మరో ముగ్గురు…?

దిశ దశ, జగిత్యాల:

సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించి తరించి ఇంటికి తిరిగి వెల్తున్నారామె. అంతలోనే అమె సమీపంలోకి రయ్ మంటూ బైక్ పై వచ్చిన అగంతకులు మెడలోని పుస్తెల తాడును లాక్కున్నారు. అంతే ఎదురు దాడికి దిగిన ఆమె బైక్ పై వచ్చిన ఓ దొంగను పట్టుకుని షాక్ ఇచ్చారు. ఈ విషయం గమనించిన స్థానికులు కూడా అక్కడుకు చేరుకుని నిందితున్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.

జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఆ మహిళను అందరూ అభినందిస్తున్నారు. చైన్ స్నాచింగ్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో డిఫెన్స్ లో పడి చాలా మంది అయోమయానికి గురవుతుంటారు. కానీ ఆమె మాత్రం ఎదురు తిరిగి మరీ ఓ స్నాచర్ ను పట్టుకోవడం గమనార్హం. లలిత అనే భక్తురాలు సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించి ఇంటికి వెల్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇతనితో ఉన్న మరో స్నాచర్ తో పాటు మరో బైక్ పై వచ్చిన ఇద్దరు పరార్ అయినట్టుగా తెలుస్తోంది. బైపాస్ రోడ్డులో సాయంత్రం వేళల్లో అయితే అంతగా జన సంచారం ఉండదని భావించిన దొంగలు చైన్ స్నాచింగ్ కు ప్రయత్నించే లలిత చేతికి చిక్కి కటకటాలపాలయ్యారు. మహిళ ప్రదర్శించిన ధైర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు మిగతా వారు కూడా ఇలాగే వ్యవహరిస్తే చైన్ స్నాచింగ్ కు పాల్పడే ముఠాలే అంతరించిపోతాయని పోలీసులు అంటున్నారు. లలిత చూపిన తెగువను ఆదర్శంగా తీసుకుని చైన్ స్నాచర్లపై ఎదురుదాడికి దిగినట్టయితే ఇలాంటి నేరాలకు అవకాశమే ఉండదని జగిత్యాల డీఎస్పీ రత్నాపురం ప్రకాష్ అన్నారు.

స్థానికులు పట్టుకున్న చైన్ స్నాచర్
crime newsCRIME TODAYJAGITHYALLatest NewsSP JAGITHYALtelangana crime newstelangana newstoday crime news