Vemulawada: ఆ ఏసీబీ నివేదికలో ఏముంది? చర్యల సిఫారసుకు కారణం ఏంటి?

దిశ దశ, వేములవాడ:

తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద శైవ క్షేత్రం… పేదల పెన్నిధిగా కీర్తించబడుతున్న రాజన్న ఆలయంలో అసలేం జరుగుతోంది? భక్తులు కొంగు బంగారంగా కొలిచే రాజన్న గుడిలో దేవాదాయ శాఖ యంత్రాంగం ఇష్టారీతిన వ్యవహరిస్తున్న తీరుపై కఠినంగా వ్యవహరించేది ఎవరూ?

ఏసీబీ రిపోర్ట్…

వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో కొంతమంది సిబ్బంది నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత సంవత్సరం ఆగస్టు 22న ఏసీబీ అధికారులు వేములవాడ రాజన్న ఆలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గోదాం, టికెట్ కౌంటర్, కళ్యాణకట్ట తదితర చోట్ల సోదాలు చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు విస్తుపోయే వాస్తవాలను వెలికి తీశారు.

టెండర్ లేకుండానే…

భక్తులకు క్వాలిటీతో కూడిన లడ్డూ ప్రసాదం అందజేయాలని ఖాజు, కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేస్తున్నారు. కానీ వాటిని పూర్తి స్థాయిలో వినియోగించకుండా దారి మల్లిస్తున్నారు. ప్రధానంగా టెండర్ ప్రక్రియ ద్వారా వంట సరుకులు కొనుగోలు చేయాల్సి ఉండగా, పాత వ్యాపారిని కొనసాగించేందుకు ఒప్పందం పొడగిస్తున్నారని ఏసీబీ ఆరాలో తేలింది. వంట మనుషులకు సంబంధించిన మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు లేకపోగా, నీటి పరీక్షలు కూడా చేయడం లేదని గుర్తించారు. ఖాజు, జాజికాయ వంటివి బ్రాండెడ్ కావని, తయారీ, గడువు తేదీలు లేవని గుర్తించారు. వంటశాలలో అపరిశుభ్రత కొట్టొచ్చినట్టుగా కనపడుతోందని తేల్చారు.

ఎక్సెస్ స్టాక్…

ఇకపోతే ఆలయ స్టోర్ రూంలో శర్కర, నగుబోతు (మిశ్రి) తప్ప మిగతా సామాగ్రి అంతా అదనంగా ఉండడం గమనార్హం. స్టోర్ రూంలో ఉన్న రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులు అదనపు స్టాక్ ఉండడాన్ని గుర్తించారు. 5331 కిలోల బియ్యం ఉన్నట్టు రికార్డుల్లో ఉండగా, 6240 కిలోలు నిలువ ఉన్నాయి. 35 కిలోల శనగ పిండి స్టాక్ ఉన్నట్టు రిజిస్టర్ లో రాసి ఉండగా 62 కిలోలు నిలువ ఉంది. 885 కిలోల సన్ ఫ్లవర్ ఆయిల్ కు 990 కిలోలు, 673 కిలోల నెయ్యి 1655 కిలోలు ఉంది. 122 కిలోల చింతపండుకు134 కిలోలు, ఖాజు 589 కిలోలకు, 734 కిలోలు, కిస్మిస్ 313 కిలోలకు, 402 కిలోలు, 275 కిలోల కందిపప్పుకు 295కిలోలు, 6821 కిలోల శనగపప్పుకు 6940 కిలోలు, 271 కిలోల పెసరపప్పుకు 280 కిలోలు, 176 కిలోల మినపప్పుకు 240 కిలోలు, 190కిలోల పల్లి నూనెకు 279 కిలోలు, 673 కిలోల నెయ్యికి, 1635 కిలోలు ఇలా ప్రతి సామాగ్రి కూడా అదనంగా ఉండగా, శర్కర 2040 కిలోలు ఉన్నట్టుగా రికార్డుల్లో ఉండగా, కేవలం 22 కిలోలు మాత్రమే ఉంది. మిశ్రి 384 కిలోలకు 79 కిలోలు మాత్రమే ఉంది.

ప్రసాదంలో

భక్తులకు విక్రయించే లడ్డూ, పులిహోర ప్రసాదంలో మోతాదుకు తగ్గట్టుగా సరుకులు కలపకపోవడం వల్లే ఎక్కువ స్టాక్ ఉందని ఏసీబీ అధికారులు తమ నివేదికలో వెల్లడించారు. లడ్డులో కలపాల్సిన ఖాజు, కిస్మిస్, ఇలాచి, నెయ్యి మోతాదుకు తక్కువగా వినియోగించడం వల్ల నాణ్యత కొరవడుతుందని అభిప్రాయపడ్డారు. కొడె మొక్కుల టికెట్లలో కూడా లోపాలు ఉన్నాయని ఏసీబీ గుర్తించింది. ఈ నివేదిక ఆధారంగానే ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ శాఖపరమైన చర్యలకు సిఫార్సు చేసినట్టుగా స్పష్టం అవుతోంది.

You cannot copy content of this page