దిశ దశ, కరీంనగర్:
నీటి పారుదల శాఖ పర్యవేక్షణలో జరగాల్సిన నిర్మాణాలు… జిల్లా సాండ్ కమిటీ ప్రతిపాదనలు… టీజీఎండీసీచే రీచుల ఏర్పాటు… పర్యావరణ సమతుల్యతను అంచనా వేయాల్సిన కాలుష్య నియంత్రణ విభాగం, భూగర్భ జలాల పరిస్థితిపై గణాంకాలు తీయాల్సిన భూగర్బ జలవనరుల శాఖ, ఓవర్ లోడ్ ను కట్టడి చేయాల్సిన రవాణా విభాగం, తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సిన వే బ్రిడ్జిలు.. ఇలా ఒక్కటా రెండో ఎన్నో శాఖల సమన్వయంతో సాగుతోంది ఇసుక తవ్వకాల తీరు. కానీ అక్కడ అజమాయిషీ ఎవరిది..? చర్యలు తీసుకోవల్సింది ఎవరూ..? ఫిర్యాదు చేస్తే తమ శాఖకు సంబంధం లేదని అంటారు ఓ శాఖ… సమాచారం అడిగితే తమకు సంబంధమే లేదంటోంది మరో శాఖ… సర్కారుకు ఆదాయం వస్తోందన్న బూచితో పర్యావరణానికి సవాల్ విసురుతున్న తీరు దేనికి సంకేతమో అధికార యంత్రాంగానికే తెలియాలి. రీచుల ఏర్పాటు కోసం శాఖల మధ్య సమన్వయం నెలకొన్నప్పటికీ నిబంధనలు అమలు చేసే విషయంలో మాత్రం ఎందుకు ఉండడం లేదన్నదే మిస్టరీగా మారింది. అదే సర్కారుకు ఆదాయం రావడం లేదని గుర్రుమంటే మాత్రం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో రీచులపై రీసెర్చ్ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. సామాన్యుడు ప్రశ్నిస్తే మాత్రం తమకేమి సంబంధం లేదంటున్నారు. దీని భావమేమిటో ఏలిన వారికి, అధికార యంత్రాంగానికే తెలియాలి.
మానేరు సాక్షిగా…
కరీంనగర్ జిల్లా మీదుగా ప్రవహించే మానేరు నది ధనాగారంగా మారినట్టయింది. ఈ నదిలోని ఇసుక అమ్మకాలపై ఉన్న మక్కువ పర్యావరణానికి తూట్లు పొడిచే విధంగా మారుతున్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉప నదిలో ఇసుక తవ్వకాలు జరపవచ్చా… లేదా..? అన్న విషయాన్ని కూడా విస్మరించి తాత్కాలిక ఉపశమనంతో నిబంధనలు అనుకూలంగా మల్చుకుని ఇసుక రీచుల ఏర్పాటు కోసం అధికార యంత్రాంగం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న తీరు స్థానికులను విస్మయపరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ లోడ్ విధానాన్ని కట్టడి చేయాలని సంకల్పించడంతో ఆ దిశగా మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు తప్ప మానేరు నది అస్థిత్వానికి సవాల్ విసురుతున్న తీరుపై మాత్రం నియంత్రణ చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తవ్వకాలు ఎంత మేర..?
చెక్ డ్యాంల వద్ద పూడికతీత చేపట్టాల్సి ఉందని ఇరిగేషన్ ఇంజనీర్లు ప్రతిపాదించగా కరీంనగర్ జిల్లా స్థాయి సాండ్ కమిటీ ఆమోదం తెలిపి TGMDCకి ప్రతిపాదనలు చేసినట్టుగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రొసిడింగ్స్ ఆధారంగా ఇసుక రీచులను స్టార్ట్ చేసింది TGMDC. వీటిని నిర్వహించే బాధ్యతలు ప్రైవేటు సంస్థలకు అప్పగించినప్పటికీ అక్కడ ఏం జరుగుతోందోన్న విషయాలపై మాత్రం దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో రీచు వద్ద హద్దులు ఏర్పర్చి ఇసుక తవ్వకాలు జరిపించాల్సి ఉన్నప్పటికీ అవి మానేరు నదిలో కను చూపు మేరలో కూడా అగుపించడం లేదు. ఎంతలోతు నుండి ఇసుక తీస్తున్నారు..? అక్కడ మిషనరీతో ఇసుక సేకరణ జరపకముందు ఎంత మేర ఇసుక ఉంది అన్న విషయంపై క్లారిటీ ఉందా లేదా అన్నది అధికారులకే తెలియాలి. నిబంధనల్లో మాత్రం బఫర్ జోన్, తో పాటు ఇంతమేర విస్తీర్ణంలో హద్దులు ఏర్పాటు చేయాలని ఉంటోంది. కాని డెప్త్ విషయంలో మాత్రం స్పష్టత లేకపోవడం విచిత్రం. దీంతో ఎవరి ఇష్టానుసారంగా వారు తవ్వకాలు జరుపుతున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు.
నీటి నిలువ చెంతనే…
కొన్ని రీచుల్లో అయితే నీటి నిలువ ఉన్న చోటే ఇసుక సేకరిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. వాస్తవంగా భూగర్భ జలాలు అడుగంటకుండా ఉండేందుకు నీటి నిలువ ఉన్నచోట కానీ, ప్రవాహం సమీపంలో కానీ ఇసుక తవ్వకాలు జరపకూడాదని నిబంధనలు చెప్తున్నాయి. కానీ TGMDC ఆధ్వర్యంలో చేపట్టిన ఇసుక రీచుల వద్ద మాత్రం ఇలాంటి నిబంధనలు అమలు చేసే వారు లేకుండా పోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ రీచులో అయితే ఏకంగా నీటి నిలువల సమీపంలోనే ఇసుక సేకరిస్తున్నారు. మిషనరీ సహాయంతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నా నియంత్రించే వారు లేకుండాపోయారు.
కమర్షియల్ ఎలా..?
ముఖ్యంగా పూడికతీత కోసం ఇసుక తరలించే విషయంలో కమర్షియల్ లావాదేవీలు జరపకూడదని తెలుస్తోంది. స్థానిక అవసరాలకు మాత్రమే ఇసుకను తరలించాల్సి ఉంటుందని, అది కూడా మిషనరీ ఉపయోగించకుండా తవ్వకాలు చేపట్టాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలే కమర్షియల్ అవసరాల కోసం ఇసుకను తరలిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. గతంలో నేషనల్ గ్రీన్ ట్యిబ్యూనల్ లో కూడా ఈ అంశంపై విచారణ జరిగినప్పుడు పూడికతీత కమర్షియల్ అవసరాల కోసం వినియోగించడం లేదని నివేదికలు కూడా ఇచ్చారు అధికారులు. కానీ వాస్తవం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా సాగుతోందని, గతంలో రీచులే అయినా కొత్తగా ఏర్పాటు చేసిన రీచుల్లో అయినా ఆర్థికలావాదేవీలే ప్రామాణికంగా ఇసుక వ్యాపారం సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. TGMDC ఆన్ లైన్ లోనే ఇసుక విక్రయాలను జరుపుతుండడంతో పూడికతీత కోసం సేకరిస్తున్న ఇసుక అమ్మకాలు జరిపిస్తున్నట్టుగా తేటతెల్లం అవుతోంది. నది పరివాహఖ ప్రాంతాల్లో ఇసుక మేటలు అతి తక్కువ ఎత్తులో వేస్తుందన్న కారణంగానే స్థానికులు నదుల్లోని ఇసుకను తొలగించాలన్న నిబంధన విధించి ఉంటారన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మరో వైపున మిషనరీ ఉపయోగించడం వల్ల ఇసుక తవ్వకాలు ఇష్టారీతిన సాగుతాయని దీనివల్ల నదిలో ఇసుక పరిమాణం గణనీయంగా తగ్గిపోతుందన్న కారణం కూడా కావచ్చని చెప్తున్నారు. నదుల్లో ఇసుక గణనీయంగా తగ్గిపోయినట్టయితే భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయే ప్రమాదం ఉంటుందని కూడా అంటున్నారు. ఈ క్రమంలో కమర్షియల్ రీచుల మాదిరిగానే పూడికతీత కోసం ఏర్పాటు చేసిన రీచుల్లో కూడా మిషనరీని ఉపయోగించేందుకు అనుమతించడం సరికాదని, అక్కడ సేకరిస్తున్న ఇసుకతో వ్యాపారం చేస్తుండడంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.