దిశ దశ, వేములవాడ:
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈఓ వినోద్ రెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వేములవాడ ఆర్డీఓ రాధా బాయిని ఇంఛార్జి ఈఓగా నియమించింది ప్రభుత్వం.
వివాదాల ప్రయాణం…
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈఓగా వినోద్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరువాత రాజన్న ఆలయం కేంద్రీకృతంగా వివాదాలు అలుముకున్నాయి. 60 కోడెలను ఓ సంస్థకు ఇచ్చే అంశం నుండి మొదలు ఏసీబీ నివేదిక ఆదారంగా శాఖాపరమైన చర్యలకు సిఫార్సు వరకు అన్నింటా కూడా రాజన్న ఆలయం విషయంలో చర్చకు దారి తీశాయి. మంత్రి సిఫార్సు మేరకు 60 కోడెలను ఒకే సంస్థకు అలాట్ చేసిన అంశంపై పెద్ద ఎత్తున దుమారం లేచిన సంగతి తెలిసిందే. అలాగే ఆలయ ఆధీనం ఉన్న కోడెల మరణాలు సంభవించడంపై కూడా ఆందోళన నెలకొంది. ఈ విషయంపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవల్సిన పరిస్థితి ఎదురైందంటే కోడెల మరణాలు వివాదం ఎంత తీవ్రంగా ముదిరిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆలయంలో అభివృద్ది పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రధాన ఆలయాన్ని మూసివేసి భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఈ విషయంలో పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆధి శ్రీనివాస్ జోక్యం చేసుకోవల్సి వచ్చింది. ఈ విషయంపై భక్తులకు స్పష్టత ఇవ్వడంలో రాజన్న ఆలయ యంత్రాంగం విఫలం అయిందన్న విమర్శలు కూడా లేకపోలేదు. ముదిరిపాకన పడిన తరువాత క్లారిటీ ఇచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. అంతేకాకుండా ఆలయ అభివృద్ది పనులను అడ్డుకుంటున్నారని స్టే తీసుకరావడం, వేములవాడ ఆలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణకు నోటీసులు పంపించిన విషయంపై కూడా స్థానికంగా చర్చ జరిగింది. దేవాదాయ శాఖ అధికారుల తీరుపై ప్రతాప రామకృష్ణ కూడా హై కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. అలాగే గత సంవత్సరం ఆలయంపై ఏసీబీ అధికారులు దాడులు జరిగాయి. ఈ మేరకు ఏసీబీ అధికారులు ఆలయంలోని స్టోర్ రూమ్, కౌంటర్లలో తనిఖీలు చేపట్టి అవకతవకలను ఎత్తి చూపారు. స్టోర్ రూంలో స్టాక్ తో పాటు టికెట్ల వ్యవహారం తదితర అంశాలన్నింటిపైనే సమగ్రమైన నివేదికను ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ నివేదిక ఆదారంగా ఆలయ ఈఓ వినోద్ రెడ్డితో పాటు పలువురు ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెలువడిన కొద్ది రోజుల్లోనే ఈఓ వినోద్ రెడ్డిని బదిలీ చేయడం గమనార్హం. అయితే శాఖాపరమైన చర్యలు తీసుకోవల్సి ఉన్నప్పటికీ ఆయనను హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ గా బదిలీ చేయడం గమనార్హం.