సెలవుపై రాజన్న ఆలయ ఈఓ

దిశ దశ, వేములవాడ:

రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటైన వేములవాడ రాజన్న ఆలయ ఈఓ రమాదేవి సెలవుపై వెళ్లారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఈఓ అంజానారెడ్డికి వేములవాడ ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు.

విల్లింగ్ ఇచ్చి..?

వేములవాడ ఆలయ ఈఓగా తాను పనిచేసేందుకు సిద్దంగా ఉన్నానని విల్లింగ్ ఇచ్చి మరీ వచ్చిన రమాదేవి అనూహ్యంగా సెలవుపై వెళ్లడం చర్చకు దారి తీస్తోంది. ఓ వైపున రాజన్న ఆలయంలో అభివృద్ది పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈఓ లీవ్ తీసుకోవడం వెనక ఆంతర్యం ఏంటన్న చర్చ సాగుతోంది. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరి ఆలయ ఈఓ నెల రోజులు సెలవుపై వెళ్లగా అదే ఆలయంలో పని చేస్తున్న మరో అధికారికి ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు. కానీ వేములవాడ రాజన్న ఆలయ ఈఓ రమాదేవి 15 రోజుల సెలవుపై వెళ్లగా మరో ఆలయ ఈఓకు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించడం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది. స్థానికంగా నెలకొన్న పరిణామలు, కొందరి మధ్య నెలకొన్న కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగానే సెలవు పెట్టి వెళ్లిపోయారన్న గుసగుసలు స్థానికంగా వినిపిస్తున్నాయి. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సఖ్యతగా ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న అధికారులు, ముఖ్య నాయకులకు పొసగకపోవడం వల్లే ఈఓ సెలవుపై వెళ్లిపోయారన్న చర్చ ఆలయ ఉద్యోగ వర్గాల్లో సాగుతోంది. రాజన్న ఆలయ ఈఓగా పని చేస్తానని ఇష్టంతో వచ్చిన ఈఓకు ఎదురైన కష్టం ఏంటన్న విషయంపై తర్జన భర్జనలు సాగుతున్నాయి.