Maoist: మరో చర్చల ప్రతినిధి గణేష్ ఎన్ కౌంటర్ లో మృతి…

దిశ దశ, దండకారణ్యం:

ఆంధ్రా, ఒడిషా బార్డర్ లో బుధవారం తెల్లవారు జామున ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 2004 శాంతి చర్చల కమిటీ ప్రతినిధి, కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ మరణించారు. ఆయనతో పాటు ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ అలియాస్ వెంకట రవి లక్ష్మీ చైతన్య అలియాస్ రూపీతో పాటు మరోకరు మరణించారు.

చర్చల ప్రతినిధి…

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్, అలియాస్ బిస్రూ, అలియాస్ బేను (57) చనిపోయారు. పార్టీ సభ్యునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన గణేష్ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండేవారు. పీపుల్స్ వార్ పార్టీలో చేరిన ఆయన సుదీర్ఘ కాలం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పని చేశారు. 1994లొ మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో లెంకలగడ్డ వద్ద మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో పంజాబ్ కమెండోల కమాండెంట్ జీఏ సాహితో పాటు మరో ఏడుగురు కమెండోలు మరణించారు. పంజాబ్ లో రర్రరిస్టులను అంతమొందించడంలో పాత్ర పోషించిన సాహి లెంకలగడ్డ ఎన్ కౌంటర్ లో మరణించడం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. అప్పుడు పంజాబ్ మాజీ డీజీపీ, పంజాబ్ కమెండోల విభాగాన్ని క్రియేట్ చేసి ఇంఛార్జిగా వ్యవహరించిన కేపీఎస్ గిల్ ప్రత్యేకంగా మహదేవపూర్ కు వచ్చారు. మహదేవపూర్ క్యాంపులోని పంజాబ్ కమెండోల్లో ధైర్యం నింపడంతో పాటు లెంకలగడ్డ వద్ద పేల్చిన మందుపాతర ఘటన కూడా జరిగింది. ఈ ఘటనకు కర్త, క్రియ, కర్త అంతా కూడా గణేష్ గా పోలీసులు ఆయనను టార్గెట్ చేసుకున్నప్పటికీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో జరిగిన పలు ఎదురు కాల్పుల్లో గణేష్ బలగాల కళ్లుగప్పి తప్పించుకున్న సందర్బాలు ఎన్నో. ప్రముఖులను టార్గెట్ చేసి మందుపాతరలను పేల్చే విషయంలో పీపుల్స్ వార్ లో ప్రముఖంగా వినిపించిన పేర్లలో గణేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. మహదేవపూర్, మహాముత్తారం, ఏటూరునాగారం తదితర ప్రాంతాల్లో రిక్రూట్ కూడా గణేష్ కారణంగా పెద్ద ఎత్తున జరిగింది. మిలిటెంట్ వ్యవస్థ నుండి మొదలు పార్టీ క్రియాశీలక కార్యకలాపాలను నిర్వహించడంలో గణేష్ స్కెచ్ వ్యూహాత్మకంగా ఉండేది. 1999 ఎన్నికల సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం దొబ్బలపాడు బ్లాస్టింగ్, భూపాలపల్లి సమీపంలోని బాంబుల గడ్డ వద్ద పేల్చివేత వంటి ఎన్నో ఘటనల్లో గణేష్ పాత్ర ప్రత్యక్షంగానో పరోక్షంగానే ఉండేది. అలాగే 1990వ దశాబ్దంలో పత్తిరైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారడంతో పరకాల, మహాదేవపూర్ ప్రాంతంలో దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో పత్తి సాగు చేసి దివాళా తీసిన రైతాంగానికి పార్టీ బాసటగా నిలవాలన్న ప్రతిపాదన కూడా గణేష్ అందించినట్లు సమాచారం. ఈ మేరకు అప్పుడు కొంతమంది రైతులకు ఆర్థిక సహాయం కూడా అందించింది. ఉత్తర తెలంగాణలో పార్టీ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించిన గణేష్ నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ (NTSZC)లో అత్యంత ముఖ్య భూమికను అందించారు వారిలో గణేష్ పాత్ర కూడా కీలకంగా ఉంది. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ (KKW) కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఏఓబికి వెల్లిపోయారు. స్థానిక దండకారణ్య ప్రాంతంలో కూడా వివిధ స్థాయిల్లో మావోయిస్టు పార్టీ నిర్మాణం కోసం కృషి చేశారు. ముఖ్యంగా మహదేవపూర్, ఏటూరునాగారం ప్రాంతంలో పాఠశాల పట్టున్న సమయంలో ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించినప్పుడు సేఫ్ జోన్ గా పొరుగునే ఉన్న చత్తీస్ గడ్డ బస్తర్ అడవులను వినియోగించుకునే వారు. ఈ కావాలనే అక్కడి ఆదివాసీలతో పీపుల్స్ వార్ పార్టీ మమేకం అయింది. దండకారణ్య ప్రాంతంలో పార్టీ నిర్మాణంలోనూ గణేష్ భాగస్వామ్యం కీలకంగా ఉంది. 2004లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చల్లో పీపుల్స్ వార్ పార్టీ ప్రతినిధిగా వ్యవహరించిన గణేష్ కేంద్ర కమిటీ సభ్యుల బాధ్యతలు నిర్వర్తించారు.

జిలానీ బేగంతో…

విప్లవ పంథాలో అజ్ఞాతంలోకి వెల్లిన గాజర్ల రవి అలియాస్ గణేష్ జిలానీ బేగం అలియాస్ మీనాను వివాహం చేసుకున్నారు. ఆమె మరణం తరువాత మరో పెళ్లి చేసుకోలేదు. 

ఆ కుంటుంబంలో ముగ్గురు…

వెలిశాల గ్రామంలో గాజర్ల కుటుంబానికి చెందిన నలుగురిలో ముగ్గురు విప్లవ పంథాలో కొనసాగుతున్నారు. పీపుల్స్ వార్ లో చేరిన వారిలో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్, గాజర్ల రవి అలియాస్ గణేష్, గాజర్ల అశోక్ అలియాస్ ఐతు ముగ్గురు అన్నదమ్ములు కూడా యూజీ క్యాడర్ లో పని చేశారు. వీరిలో సారయ్య అలియాస్ అజాద్ పదిహేనేళ్ల క్రితం ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో మరణించారు. అశోక్ అలియాస్ ఐతు ఇటీవలే జనజీవనంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. తాజాగా బుధవారం తెల్లవారుజామున గ్రేహౌండ్స్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య సరిహద్దుల్లోని రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతంలోని గుట్టల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో గణేష్ అలియాస్ ఉదయ్ చనిపోయారు.

ముగ్గురు ఎన్‌లోనే కౌంటర్…

పీపుల్స్ వార్ ప్రస్థానం నుండి పార్టీలో పని చేస్తూ ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఎదిగిన అరుణ అలియాస్ వెంకట రవి లక్ష్మీ చైతన్య అలియాస్ రూపీ కూడా మరణించారు. విశాఖపట్నం జిల్లా పెందూరు మండలం కరకవాణిపాలెంకు చెందిన అరుణ అన్న అజాద్ అలియాస్ రాజ్ కుమార్ 2004 శాంతి చర్చల తరువాత మరోసారి చర్చల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. తీసుకొచ్చారు. స్వామి అగ్నివేష్ ద్వారా శాంతి చర్చల ప్రస్తావన వెలుగులోకి వచ్చింది. ఈయన ఆసిపాబాద్ సరిహద్దుల్లోని వాంకిడీ సమీపంలో ఎన్ కౌంటర్ లో చనిపోయారు. ఆమె భర్త రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి ఈ ఏడాది జనవరి నెలలో ఒడిషా సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించారు. తాజాగా అరుణ కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం సమీపంలోని కింటుకూరు జిల్లాలో మరణించారు. బుధవారం మరణించిన మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలిద్దరూ కూడా చర్చల అంశంతో ముడిపడిన వారే కావడం లేదు.

ఆ ఫోటో ఎప్పటిదంటే..?

చలపతి ఎన్ కౌంటర్ తరువాత వైరల్ అవుతున్న ఓ ఫోటో గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అరుణక్క మృతి తరువాత వీరిద్దరూ కలిసి దిగిన అదే సెల్ఫీ వైరల్ అవుతోంది. ఉత్తరాంధ్రలో జరిగిన ఓ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ భారీ నష్టాన్ని చవి చూసింది. ఘటన స్థలంలో లభ్యమైన మొబైల్ ఫోన్లలో పోలీసులకు ఈ ఫోటో చిక్కినట్లు సమాచారం. అయితే అంతకుముందు జరిగిన ఓ ఘటనలో అరుణక్క మరణించిందన్న ప్రచారం జరగడంతో తామిద్దరం క్షేమంగా ఉన్నామని సెల్ఫీ దిగి తన సోదరునికి పంపించినట్లుగా సంకేతాలు అయితే ఆ తరువాత చాలా కాలానికి పోలీసుల చేతికి చిక్కిన ఈ ఫోటో ఆధారంగా వీరెవరు అన్న కోణంలో ఆరా తీశారు. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ నేత ఒకరు చలపతి, అరుణక్కలని చెప్పడంతో పాటు ఈ ఫోటో నేపథ్యాన్ని కూడా పోలీసులకు వివరించినట్లు సమాచారం.

You cannot copy content of this page