సాఫల్య కేంద్రాలపై చర్యలు తీసుకోండి…

జిల్లా కలెక్టర్ కు వినతి చేసిన ఏఐవైఎఫ్

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ జిల్లా కేంద్రంలో గుర్తింపు లేని సంతాన సాఫ్యల కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ కోరారు. గ్రీవెన్స్ డే సందర్భంగా ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసిన ఆయన సంతానం కోసం కలలు కంటున్న దంపతుల ఆశలను ఆసరగా చేసుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. వీర్యం అండాలను సేకరించి లక్షల్లో సొమ్ము చేసుకుంటూ వికృత దందా కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాఫల్య కేంద్రాల నిర్వాహకులు నిబంధనలకు విరుద్దంగా నడుచుకుంటున్న తీరు గురించి బాధితులు చెప్పుకుని వేదనకు గురవుతున్నారన్నారు. సంతానం లేని దంపతుల కోసం గుర్తు తెలియని వ్యక్తుల నుండి వీర్యాన్ని సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని బ్రాహ్మణపల్లి యుగంధర్ వివరించారు. వివిధ పద్దతుల ద్వారా సంతానం కలిగే విధంగా చికిత్స చేస్తామని చెప్పుకుంటున్న సాఫల్య కేంద్రాలు బాధితుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయన్నారు. కరీంనగర్ లో యథేచ్ఛగా సాగుతున్న ఫెర్టిలిటీ దందాలపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని యుగంధర్ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి చెంచాల మురళి రమేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.