ఎండాకాలం పోలీసుల కఠిన నిర్ణయం: కార్లకు అవి ఉంటే అంతే ఇక…

దిశ దశ, కరీంనగర్:

మండుతున్న ఎండల నుండి ఉపశమనం పొందుతూ ఏసీ కార్లలో తిరిగే వారు జాగ్రత్తగా ఉండాలిక… నిబంధనలకు విరుద్దంగా వాహనాల డోర్స్ అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ (టింటెడ్ గ్లాసెస్) ఉంటే మాత్రం ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేయడం ఖాయం. రోడ్లపైకి వాహనాలను తీసుకొచ్చే ముందే బ్లాక్ ఫిల్మ్ తొలగించుకోవాల్సిందే. లేనట్టయితే కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు ఎక్కడో ఓ చోట కారు ఆపి కారు అద్దాలకు వేసిన బ్లాక్ ఫిల్మ్ తొలగించడంతో పాటు జరిమానా కూడా విధిస్తారు. ఎండకాలం వాహనాల్లో కూల్ కంటిన్యూగా ఉండాలంటే  బ్లాక్ ఫిల్మ్ కంపల్సరీ అన్నట్టుగా మారింది. దీంతో చాలామంది వాహనాల  యజమానులు బ్లాక్ ఫిల్మ్ వేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో బ్లాక్ పిిల్మ్ తొలగించేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టినప్పటికీ కొంతకాలం తరువాత నిలిపివేశారు. కరీంనగర్ కమిషనరేట్ లో తాజాగా బ్లాక్ ఫిల్మ్ తొలగించే పనిలో ట్రాఫిక్ పోలీసులు నిమగ్నం కావడంతో వాహనాదారులు షాక్ అవుతున్నారు. ఉన్నట్టుండి టింటెడ్ గ్లాసెస్ పై దృష్టి సారించడం ఏంటని ఆందోళన చెందుతున్నారు. అసలే ఎండాకాలం కావడంతో బ్లాక్ ఫిల్మ్ తొలగించడం వల్ల వాహనాల్లో ఏసీ వేసుకున్నా చల్లదనం అంతగా ఉండదన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వాహనాల అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించాలని నిర్ణయించామని పోలీసులు చెప్తున్నారు. ఏది ఏమైనా కరీంనగర్ పోలీసులు వేసవి కాలంలో తీసుకున్న ఈ నిర్ణయంతో తమకు ఇబ్బందులు తప్పేలా లేవని వాపోతున్నారు.