Phone Tapping case: రాజీనామా ఆమోదించిన తరువాతే అమెరికా వెళ్లారా..?

SIB మాజీ చీఫ్ టూర్ పై మరో కోణం…

దిశ దశ, హైదరాబాద్:

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విషయంలో రోజుకో అంశం తెరపైకి వస్తోంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తన బాధ్యతలకు రాజీనామా చేసిన రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. అయితే ఆయన అమెరికా బయలుదేరే సరికి రాజీనామా ఆమోదించారా లేదా అన్న విషయంపై చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు ప్రభాకర్ రావు రాజీనామా చేశారన్న విషయం మాత్రమే వెలుగులోకి వచ్చింది. కానీ ఆయన రాజీనామా ఆమోదించక ముందు విదేశాలకు వెల్లారా లేక ఆ తరువాతే వెళ్లారా అనేదే అర్థం కాకుండా పోతోంది. ఒక వేళ రాజీనామా ఆమోదించక ముందు ప్రభాకర్ రావు విదేశాలకు వెల్లినట్టయితే నిబంధనలకు అనుగుణంగా నడుచుకున్నట్టేనా కాదా అన్న విషయంపై తేల్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఐజీ స్థాయిలో పనిచేసిన అధికారి రిటైర్ అయిన తరువాత కూడా అత్యంత కీలకమైన విభాగానికి చీఫ్ గా బాద్యతలను అప్పగించింది అప్పటి ప్రభుత్వం. ప్రభుత్వంలోని పెద్దలు ప్రభాకర్ రావుకు బాధ్యతలు ఇవ్వాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆయనను విధుల్లో కొనసాగించేందుకు పోలీసు విబాగానికి చెందిన ఉన్నతాధికారి కానీ, ప్రభుత్వంలోని ముఖ్య అధికారి కానీ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. ఎస్ఐబీ చీఫ్ గా ప్రభాకర్ రావును అపాయింట్ చేసిన సదరు అధికారికి కానీ ఆ స్థానంలో ఉన్న మరో అధికారికి కానీ రాజీనామా పత్రాన్ని అందించాల్సి ఉంటుంది. సదరు అధికారే దానిని ఆమోదించినట్టయితే రాజీనామా అమల్లోకి వస్తుంది కానీ… రాజీనామాను ఆమోదించక ముందే విధుల నుండి రిలీవ్ కావడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభాకర్ రావు రాజీనామాపై ఆమోదం తెలపకముందే విదేశాలకు వెళ్లిపోవడం సర్వీసు రూల్స్ కు విరుద్దమా కాదా అన్న విషయంపై ధృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ రాజీనామాను ఆమోదించిన తరువాతే ప్రభాకర్ రావు విదేశాలకు వెల్లినట్టయితే ఆయన స్థానంలో ఎవరిని నియమించారు..? ఈ మేరకు ఉత్తర్వులు అందుకున్న అధికారి బాధ్యతలు తీసుకున్నారా లేదా అనే విషయంపై స్పష్టత రావల్సిన అవసరం ఉంది. ప్రభాకర్ రావు విషయంలో నిబంధనల మేరకే నడుచుకున్నట్టయితే ఇంఛార్జి బాధ్యతలు తీసుకున్న అధికారి ఎస్ఐబీ కార్యాలయంలో హైండోవర్ చేసుకున్న వివరాలను రికార్డుల్లో రాశారా లేదా అన్న విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం ఉంది. రికార్డులను పరిశీలించకుండానే హాడావుడిగా బాధ్యతలు తీసుకుని ఆ తరువాత నివేదిక ఇచ్చినట్టయితే సదరు అధికారి నిర్లక్ష్యం కూడా ఉన్నట్టేనని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకయితే ప్రభాకర్ రావు రాజీనామా చేసి విదేశాలకు వెల్లినట్టుగానే బహిర్గతం అయింది కానీ ఆయన రాజీనామాను ఆమోదించినట్టుగా అయితే ఎక్కడా వెలుగులోకి రాలేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరువాత గత ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ అధికారులను రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రాజీనామాలు అందుకున్న తరువాత వాటిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆమోదం తెలిపారు ఉన్నతాధికారులు. ఒకవేళ ఈ జాబితాలో ప్రభాకర్ రావు పేరు కూడా ఉన్నట్టయితే ఆయన సర్వీసులో ఉన్నప్పుడే విదేశాలకు వెల్లినట్టు అవుతుంది తప్ప రాజీనామా ఆమోదించిన తరువాత కాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సాధారణ విభాగాల్లోనే సర్వీస్ రూల్స్ కు అనుగుణంగా నడుచుకోవల్సి ఉంటున్న నేపథ్యంలో అత్యంత కీలకమైన పోలీసు విభాగం… అందులో స్పెషల్ ఇంటలీజెన్స్ బ్యూరో చీఫ్ గా బాధ్యతల్లో ఉన్న అధికారి బాధ్యతల నుండి తప్పుకునే విషయంలో ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ విదేశాలకు వెల్లేందుకు రాజీనామాకు ముందే ప్రభాకర్ రావు ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నట్టయితే ఆయన రాజీనామాను ఆమోదించే విషయంలో నిపుణుల సలహా తీసుకుని నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని అంటున్న వారూ లేకపోలేదు. 2008లో ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా సురభి భూంరావు బరిలో నిలవగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తానిపర్తి భాను ప్రసాద రావు పోటీ చేశారు. అయితే నామినేషన్ల పర్వం ముగిసిన తరువాత సురభి భూంరావు గతంలో టీచర్ గా పనిచేశారని ఆయన రాజీనామాను ఆమోదించలేదని ఫిర్యాదు చేయడంతో స్క్రూటినీలో భూంరావు నామినేషన్ తిరస్కరిస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకున్నారు. దీంతో భాను ప్రసాదరావు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ కావడం అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. ఈ లెక్కన ప్రభుత్వ యంత్రాంగం రాజీనామాను ఆమోదించనట్టయితే వారు సర్వీసులోనే ఉన్నట్టుగా పరిగణనలోకి తీసుకోవల్సి వస్తుందని స్పష్టం అవుతోంది. ప్రభాకర్ రావు రాజీనామా చేసినప్పటికీ ఆయన రాజీనామాను ఆమోదించనట్టయితే ఖచ్చితంగా ఆయన సర్వీసులో ఉన్నట్టుగానే పరిగణించాల్సి వస్తుంది కదా అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రభాకర్ రావు రాజీనామా విషయంలో పోలీసు ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రకటన విడుదల చేస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదు.

ప్రణిత్ రావు…

డీఎస్పీ ప్రణిత్ రావు ఎస్ఐబీలోనే పని చేస్తున్నందున ఆయన ఆఫీసు ఆవరణోలనే రికార్డులను ధగ్దం చేయడం, హార్డ్ డిస్కులను ధ్వంసం చేసి మూసీలో పడేసినట్టుగా సిట్ దర్యాప్తులో తేలింది. ఈ పనులన్ని కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే చేశానని డీఎస్పీ ప్రణిత్ రావు కన్ఫెషన్ రిపోర్టులో వెల్లడించారు. ఈ లెక్కన ప్రభాకర్ రావు రాజీనామా చేసే సమయంలోనే జాగ్రత్త పడి వ్యూహాత్మకంగా విదేశాలకు వెల్లారా అన్న అంశం కూడా తెరపైకి వస్తోంది. ఒకవేళ ఆయన రాజీనామాకు ముందే ఈ ఎపిసోడ్ నడిపినట్టయితే రికార్డులను ధ్వంసం చేసేంత సాహసం చేయడానికి కారణం ఏంటన్నదే మిస్టరీగా మారిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page