Maoist: బీఆర్ దాదా లక్ష్యంగా జనవరి నుండే విఫలయత్నం…

విప్లవ ద్రోహుల వల్లే ఆయన్ని కోల్పోయాం

DKSZC అధికార ప్రతినిధి వికల్ప్  ప్రకటన

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఉరఫ్ బసవరాజ్ అలియాస్ బీఆర్ దాదాతో పాటు మిగతా నక్సల్స్ మరణించిన ఘటనపై ఆ పార్టీ స్పందించింది. DKSZC అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట ఓ ప్రకటన విడుదల అయింది. ఈ నెల 21న జరిగిన ఈ ఎన్ కౌంటర్ పై ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీ నుండి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. సోమవారం ఈ మేరకు మీడియాకు చేరిన లేఖలో పలు అంశాల గురించి వికల్ప్ ప్రస్తావించారు.

జనవరి నుండే…

మావోయిస్టు పార్టీ చీఫ్ బీఆర్ దాదా లక్ష్యంగా గత జనవరి నుండే పావులు కదుపుతున్నారని వికల్ప్ ఆ ప్రకటనలో ఆరోపించారు. రెండు మూడు సార్లు ఆయనపై తప్పుడు ప్రచారం కూడా చేశారన్నారు. మాఢ్ అటవీ ప్రాంతంలో బీఆర్ దాదా ఉన్నాడని తెలుసుకున్న బలగాలు ఆయన కోసం భారీ స్కెచ్ వేసుకున్నాయని అయితే పార్టీ ద్రోహులు కూడా వారితో చేతులు కలపడంతో ముఖ్య నాయకున్ని కోల్పోవల్సి వచ్చిందని వికల్ప్ వెల్లడించారు. మే 21న జరిగిన గుండెకోట్ ఘటన ఊచకోతేనని ఆరోపించిన ఆయన గొప్ప ఉద్యమకారున్ని కోల్పోవడం పార్టీకి తీరని లోటేనని ఆయన ఆశయాల సాధన కోసం ముందుకు సాగుతామని ప్రకటించారు. ఈ ఘటనలో సీసీ స్టాఫ్ రాష్ట్ర కమిటీ స్థాయి నేత నాగేశ్వర్ రావు అలియాస్ మధు అలియాస్ జంగ్ నవీన్, సీసీ సిబ్బంది సంగీత, భూమిక, వివేక్, సీపీవైపీసీ కార్యదర్శి కామ్రేడ్ చందన్ అలియాస్ మహేశ్, సీపీవైపీసీ సభ్యులు గుడ్డు, కమల్సు, రమే, ల్యాగో, రాజేష్, రవి, సునీల్, సరిత, రేష్మ, రాజు, జమున, గీత, హంగీ, సంకి, బద్రు, నీలేష్, సంజులతో పాటు మొత్తం 28 మంది చనిపోయారని వికల్ప్ ప్రకటించారు. నీలేష్ మృతదేహాన్ని తమ పార్టీ గుర్తించిందని, బీఆర్ దాదాతో పాటు మొత్తం 35 మంది ఉండగా అందులో 28 మంది చనిపోయారన్నారు.

సేఫ్ జోన్ కు వెళ్లమన్నాం…

వాస్తవంగా కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజ్ వద్ద 60 మంది కంటే ఎక్కువ మంది రక్షణ వలయంగా ఉండేవారని ప్రతికూల పరిస్థితుల్లో అటవీ ప్రాంతాల్లో సంచరిచండం ఇబ్బందికరంగా మారిందని 35 మందికి తగ్గించాల్సి వచ్చిందని వికల్ప్ వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ దాదాను సేఫ్టీ జోన్ కు తరలి వెళ్లాలని సూచించినప్పటికీ ఆయన ఒప్పుకోలేదన్నారు. భద్రత కారణాల దృష్ట్యా ఆయనను ప్రశ్రించినప్పుడు కూడా తన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తానీ బాధ్యతల్లో రెండు నుండి మూడు ఏళ్ల వరకు కొనసాగగలనని, యువ నాయకత్వం భద్రతపై దృష్టి పెట్టాలని సూచించారన్నారు. బలిదానాలు ఉద్యమాలను బలహీనపర్చలేవని, ప్రాణ త్యాగం వృధా కాదని, చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని, బలిదానాలు విప్లవాత్మక ఉద్యమాలకు ప్రేరణ ఇచ్చాయని చెప్పారన్నారు. అయినప్పటికీ దాదాను సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించినా ఆయన వినలేదని వికల్ప్ వివరించారు.

అసలేం జరిగిందంటే..?

గత ఆరు నెలలుగా బసవ రాజ్ కోసం బలగాలు విఫలయత్నం చేశాయని, అయితే మే 17వ తేదిన జరిగిన ఓ విప్లవ ద్రోహి కారణంగా ఈ దారుణం జరిగిందని వికల్ప్ ఆవేదనతో తెలిపారు. 17న సీసీ కమిటీ కార్యదర్శికి సంబంధించిన యూనిట్ లోని ఒక PPC సభ్యుడు తన భార్యతో కలిసి పారిపోయిన తరువాత షెల్టర్ ను మార్చివేశామని తెలిపారు. మే 19 ఉధయం పోలీసుల బలగాలు సమీపంలోని గ్రామానికి చేరుకుని అడవుల్లోకి వచ్చాయన్నారు. మే 19 ఉదయం 10 గంటలకు మొదటి సారి ఎధురు కాల్పులు మొదలు కాగా ఆ రోజు సాయంత్రం వరకు మొత్తం ఐదు సార్లు ఎన్ కౌంటర్ జరిగిందని వికల్ప్ వెల్లడించారు. 20వ తేదిన కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ బలగాల ప్రయత్నాలు విఫలం కావడంతో 20 వేల మంది బలగాలను మోహరించి 21 ఉదయం తుది ఆపరేషన్ చేపట్టారన్నారు. అత్యాధునిక ఆయుదాలతో గాలింపు చేపట్టినప్పుడు విప్లవకారులు కేవలం 35 మంది మాత్రమే ఉన్నారన్నారు. బలగాలకు హెలిక్యాప్టర్ల ద్వారా ఆహారం అందుతుండగా అడవిలో చక్రబంధంలో చిక్కుకున్న బీఆర్ దాదాతో పాటు మిగతా వారికి 60 గంటలుగా తినడానికి తిండి, తాగడానికి నీరు దొరకకపోవడంతో ఆకలితో అలమటించారని వికల్ప్ ఆ ప్రకటనలో తెలిపారు.

చివరి వరకూ పోరాడి…

బలగాలకు, తమ పార్టీ సహచరులకు మధ్య ఎదురు కాల్పులు ప్రారంభం కాగా బీఆర్ దాదాను సురక్షితంగా కాపాడేందుకు చివరి క్షణం వరకు ఎధురొడ్డి పోరాటం చేశారని వికల్ప్ వివరించారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో DRGకి చెందిన కోట్లూ రాము మరణించడంతో కొంతసేపు ఎధురు కాల్పులు నిలిచిపోయాయన్నారు. ఆ తరువాత మళ్లీ ఎన్ కౌంటర్ స్టార్ట్ కాగా కమాండర్ చందన్ ముందుండి బలగాలతో పోరాటం చేస్తున్న క్రమంలో చనిపోయాడని, ఈ క్రమంలో జవాన్లపై కాల్పులు జరిపి గాయపరుస్తూ ముందుకు సాగినప్పటికీ భారీ షెల్లింగ్ కారణంగా ఆ బృందం తప్పించుకోలేకపోయిందని, ముట్టడిని చేధిస్తున్న క్రమంలో ప్రధాన బృందాన్ని వీడాల్సి వచ్చిందని వికల్ప్ తెలిపారు. దాదాను కాపాడేందుకు బృందం చివరి క్షణం వరకూ పోరాటం చేసి ప్రాణాలు కోల్పోగా ఆయన్ను పట్టుకుని బలగాలు కాల్చి చంపాయని డీకేఎస్ జడ్సీ అధికార ప్రతినిధి వికల్ప్ ఆ ప్రకటనలో వెల్లడించారు.

కాల్పుల విరమణ…

శాంతి చర్చల ప్రతిపాదనల నేపథ్యంలో 40 రోజుల పాటు మావోయిస్టు పార్టీ కాల్పులకు పాల్పడలేదని వికల్ప్ స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో కుట్రతో వ్యవహరించి భారీ దాడిని చేశారని ఆరోపించారు. మే 21 చరిత్రలోనే చీకటి రోజని, బలమైన శత్రువును ఎధుర్కొనేందుకు ఉధ్యమాలు ఇలాంటి నష్టాలను చవి చూడాల్సి వస్తుందన్నారు. బసవరాజ్ బలమైన భావజాలం నిర్మించబడి ఉందని, ఆయన మార్గదర్శనం స్పూర్తితో పని చేసేందుకు బలమైన క్యాడర్ ఉందని, అనుభజ్ఞులైన కేంద్ర కమిటీ కూడా ఉన్నదని, ప్రతికూల పరిస్థితుల నుండే విప్లవాత్మక ఉద్యమాలు ఉద్భవిస్తాయని వికల్ప్ ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ సైన్యాన్ని ఉపయోగిస్తున్నారని, ఇది కొంతమేర విజయవంతం అయినప్పటికీ విప్లవాత్మక ఆలోచనలు తొలగించడం మాత్రం సాధ్యం కాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలని వికల్ప్ స్పష్టం చేశారు.

పాకిస్తాన్ తో అలా…

పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, ఉగ్రవాదులు కలిసి ఉన్నట్టుగా ఆధారాలతో ప్రభుత్వం చూపుతోందని, ఇదే నిజమైతే పాకిస్తాన్ డీజీఎంఓతో చర్చల అనంతరం కాల్పుల విరమణ ఎలా అమల్లోకి వచ్చిందని వికల్ప్ ప్రశ్నించారు. పాకిస్తాన్ తో కాల్పుల విరమణ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించిన శక్తి ఎవరని..? దేని కోసం దేశంలో తిరంగా యాత్ర నిర్వహిస్తున్నారు..? ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదా అని అడిగారు.

You cannot copy content of this page