తాజాగా మరో కేసు నమోదు…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ సమీపంలోని రేకుర్తి భూముల్లో అక్రమాల జాతరపై బాధితులు ఇంకా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఓ సర్వే నంబర్ భూమికి మరో నంబర్ వేసి ఆక్రమించుకునేందుకు కుట్ర చేశారన్న అభియోగంపై తాజాగా మరో కేసు నమోదు అయింది. గతంలో పలు కేసుల్లో నిందితునిగా ఉన్న నందెల్లి మహిపాల్ సహా పలువురిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నంబర్ 269/2025 సెక్షన్ 420, 467, 468, 471, 120-Bలలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో నందెల్లి మహిపాల్, బండిపెల్లి సురేందర్, బండారి మారుతి, అస్తాపురం సాయిలు, అస్తాపురం మల్లయ్యలను నిందితులుగా పేర్కొన్నారు. బాధితుడు షేక్ అబూబాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. రేకుర్తి శివారులోని 227 సర్వే నంబర్ 1.20 ఎకాల భూమి వారసత్వంగా షేక్ అబూబాకర్ తల్లి షేఖాబీకి రాగా దానిని ఆమె కూతురు షేక్ సాలేహాకు ఇచ్చారు. ఈ భూమిలో 2010లో షేక్ అబూబాకర్ జీపీఏ ద్వారా కాస్తూ చేసుకుంటున్న క్రమంలో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు రాగా అప్పీల్ కు వెళ్లారు. అయితే 1.20 గుంటల భూమిలో 2014లో బండి రఘురాం అనే వ్యక్తికి 23 గుంటల భూమిని విక్రయించానని, మిగతా 37 గుంటల భూమి తన ఆధీనంలోనే ఉందని షేక్ అబూబాకర్ వివరించారు. ఇట్టి భూమిని కాజేయాలన్న కుట్రతో నందెల్లి మహిపాల్, బండిపెల్లి సురేందర్, బండారి మారుతి, అస్తాపురం సాయిలు పేరిట 19 గుంటలు, అస్తాపురం తిరుపతి 19 గుంటలు , అస్తాపురం మల్లయ పేరిట 21 గుంటల భూమి ఉన్నట్టుగా చూపించారని, ఈ భూమికి సంబంధం లేని సర్వే నంబర్లు 231, 232, 233 వేసి డాక్యూమెంట్ నంబర్ 12965/2013 విక్రయ దస్తావేజు చేసుకున్నారని అబూబాకర్ ఆరోపించారు. 2023లో ఈ డాక్యూమెంట్ల ఆధారంగా 227 సర్వే నంబర్ భూమిలోకి అక్రమంగా ప్రవేశించారని వివరించారు. అప్పుడు తన వద్ద పనిచేస్తున్న వారిని పంపించి అభ్యంతరం వ్యక్తం చేయగా వారిని బెదిరించి షేక్ అబూబాకర్ ను చంపుతామని హెచ్చరించారు. వాస్తవంగా రేకుర్తి శివార్లలో 230 సర్వే నంబర్ల వరకే భూములు ఉన్నాయని 231 నుండి రికార్డుల్లో లేవని తెలుసుకున్నాని, తన భూమిని కాజేసేందుకే తప్పుడు సర్వే నంబర్లు వేసి డాక్యూమెంట్లు క్రియేట్ చేశారని అబూబాకర్ ఆరోపించారు. ఈ మేరకు ఈ నెల 14న క్రిమినల్ కేసు నమోదు చేసిన కొత్తపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.