మూడోసారి… క్యాబినెట్ హోదా…
రాష్ట్ర మంత్రిగా “అడ్లూరి”
దిశ దశ, జగిత్యాల:
ధర్మపురి ఎమ్మెల్యేలకు అచ్చొచ్చినట్టుగా ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో గెలిచిన వారికి క్యాబినెట్ హోదా దక్కడం విశేషం. హెరిటేజ్ పట్టణమైన ధర్మపురి నుండి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నేతలు గెలిచారు. ధార్మిక క్షేత్రమైన ధర్మపురి అత్యంత వైవిధ్యతను సంతరించుకుంది. ఇక్కడ వెలిసిన నృసింహ ఆలయం నేలపై ఉండడం విశేషం.
అప్పుడు…
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుండి గెలిచిన కొప్పుల ఈశ్వర్ మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గా క్యాబినెట్ హోదా అందుకున్నారు. రెండోసారి సంక్షేమ మంత్రిగా వ్యవహరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అడ్లూరికి అనూహ్యంగా మంత్రి పదవి దక్కింది.
విధేయతకు పట్టం…
సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి రావడం విధేయతకు పట్టం కట్టినట్టయింది. ఇతర పార్టీల నుండి ఆఫర్లు వచ్చినా నిర్మోహమాటంగా తోసి పుచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. ఆ నిర్ణయమే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కలిసి వచ్చింది.
నేపథ్యం ఇది…
కార్మిక క్షేత్రమైన గోదావరి ఖని నుండి అడ్లూరి ప్రస్తానం ప్రారంభం అయింది. విద్యార్థి దశ నుండే రాజకీయాల్లోకొచ్చిన అడ్లూరి 1982 నుంచి 85 వరకు గోదావరిఖని జూనియర్ కళాశాల NSUI ప్రెసిడెంట్ గా పని చేశారు. 1986 నుంచి 1994 మధ్య కరీంనగర్ జిల్లా NSUI ప్రధాన కార్యదర్శి గాలక్ష్మణ్ కుమార్ పని చేశారు. 1994 నుంచి 96 వరకు కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, 1996 నుంచి 2001 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, 2006లో మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పనిచేసిన మాతంగి నర్సయ్యపై ధర్మపురి మండల zptcగా గెలిచారు. 2009లో డీలిమిటేషన్ అనంతరం ధర్మపురి ఎస్సీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆయన కొప్పుల ఈశ్వర్ పై కేవలం 1365 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2010 నుండి 2012 వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 2013- 14లో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ గా వ్యవహరించారు. 2014లోనూ ధర్మపురి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి మళ్లీ తన చిరకాల ప్రత్యర్థి కొప్పులపై ఓటమి చవి చూశారు. 2018లో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరి
2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొప్పుల చేతిలో మరోసారి ఓటమిపాలయ్యారు. ఓట్ల లెక్కింపులో గోల్ మాల్ జరిగిందని న్యాయ పోరాటం చేస్తున్నారు. 2023లో ధర్మపురి నుంచి మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అడ్లూరిని విజయం వరించింది. రాష్ట్ర ప్రభుత్వ విప్ గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో బెర్త్ ఖాయం చేసుకున్నారు.
ఉమ్మడి జిల్లా రికార్డ్
ఇకపోతే ఏక కాలంలో మంత్రి పదవులు వరించిన ఘనత కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు దక్కింది. ఏక కాలంలో ముగ్గురు ఉమ్మడి జిల్లా వాసులు రాష్ట్ర క్యాబినెట్ లో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లు ఏక కాలంలో మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహించారు. అయితే ఈటెలను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయడంతో ఆ సంఖ్య మూడుకు పడిపోయింది. ప్రస్తుతం మంథని నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్యాబినెట్ మంత్రిగా రాష్ట్ర పరిపాలనలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ వాసి, హుస్నాబాద్ నుండి గెలిచిన పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ధర్మపురి ఎమ్మెల్యే అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ముగ్గురు మంత్రులుగా వ్యవహరిస్తుండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.