దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించిన అంశంపై మరోసారి స్పందించారు. బుధవారం జగిత్యాలలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి. తనపై ఏదో రంగు పూసి పదవి పోగొట్టాలని చూస్తున్నారని తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. రేపు అసెంబ్లీ స్పీకర్ ముందు ఓవరాల్ ఆర్గ్యూమెంట్స్ జరగనున్నాయని ఒక్క బిడ్డ పెళ్లయిపోయిందని, ఇప్పుడు మీ కోసం పని చేసే బాధ్యత తనదేనని డాక్టర్ సంజయ్ వ్యాఖ్యానించారు. పార్టీ మారినట్టయితే దానికి చట్ట ఉంటుందని, కానీ తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని కుండబద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని అడగలేదన్న ఆయన ముఖ్యమంత్రితో కలిసి పని చేస్తున్నామన్నారు ఎవరెవరు మంచిగా కలిసి పని చేస్తే వాళ్లకు అన్ని విధాలుగా వారు సహకరిస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే అన్నారు.

