Maoist : ఎవరా హిడ్మా… ఏమా కథా..?

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు పార్టీ కీలక నేత, మోస్ట్ వాంటెడ్ నక్సల్ లీడర్ హిడ్మా అరెస్ట్ అయ్యాడా..? జాతీయ స్థాయి నిఘా వర్గాలు వేటాడుతున్న హిడ్మా పోలీసులకు చిక్కినట్టేనా..? దండకారణ్యంలో మిలటరీ ఆపరేషన్లకు బ్రేకు పడినట్టేనా..? ఒడిషా రాష్ట్రం కోరాపూట్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన హిడ్మా, మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఒకరేనా..?

కోరాపుట్ లో అరెస్ట్…

మావోయిస్టు పార్టీ దండాకరణ్య ప్రాంతంలోని దక్షిణ బస్తర్, కెర్లపాల్ ఏరియా కమిటీ సభ్యుడు కుంజం హిడ్మా అలియాస్ మోహన్ ను ఒడిషాలోని కోరాపూట్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 2007లో బాల సంఘం, జననాట్య మండలిలో చేరిన కుంజం హిడ్మాది బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జానగూడ గ్రామం. ఇతను దండకారణ్యంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీలో పనిచేస్తూ ప్రస్తుతం ఏరియా కమిటీ సభ్యునిగా ఎదిగాడు. ప్రస్తుతం ఆంధ్రా ఒడిషా బార్డర్ ఏరియాలో ACM గా పనిచేస్తున్న హిడ్మా అలియాస్ మోహన్ ను గురువారం తెల్లవారు జామున అరెస్ట్ చేసినట్టు కోరాపూట్ జిల్లా పోలీసు అధికారులు ప్రకటించారు. ఇతని నుండి ఒక AK 47 ఆయుధం, 35 రౌండ్లు, ఒక మ్యాగ్జిన్, 27 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 90 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 2 కిలోల గన్ పౌడర్, స్టీల్ కంటైనర్స్ 2, రేడియోలు 2 మొత్తం 15 రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు ప్రకటించారు.

శకం ముగిసినట్టేనా..?

అయితే హిడ్మా అరెస్ట్ అన్న సమాచారం అందగానే మావోయిస్టు పార్టీ తీరని నష్టాన్ని చవి చూసిందన్న ప్రచారం ఊపందుకుంది. మోస్ట్ వాంటెడ్ నక్సల్ లీడర్ అయిన హిడ్మా అరెస్ట్ అయ్యారన్న అంశం పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కానీ తాజాగా ఒడిషాలోని కోరాపూట్ పోలీసులు అరెస్ట్ చేసిన హిడ్మాకు, మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మాకు ఏ మాత్రం సంబంధం లేదు. మిలటరీ ఆపరేషన్లలో దిట్ట, మిలటరీ ప్లాటూన్ కమాండర్ బాధ్యతల్లో ఉన్న హిడ్మా జీనగూడ సమీపంలోని పువ్వర్తి గ్రామం. బలగాలపై దాడులు చేసి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ వ్యూహాలను అమలు చేయడంలో నిపుణుడు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ బలగాలను మాటు వేసి దాడులు చేసే విషయంలో, కవ్వింపు చర్యలకు పాల్పడి బలగాల చుట్టూ ఉచ్చు బిగించడంలో అత్యంత నేర్పరి. కీకారణ్యాల్లో బలగాలు కూంబింగ్ చేస్తున్నప్పుడు PLGA బృందాల ద్వారా ముప్పేట దాడులు చేయించిన ఘటనల్లో కూడా హిడ్మా పకడ్భందీ స్కెచ్ వేస్తాడని పేరుంది. ఇటీవల చత్తీస్ గడ్, తెలంగాణ సరిహధ్దుల్లోని కర్రెగుట్టల్లో హిడ్మాతో పాటు ప్లాటూన్స్ సంచరిస్తున్నాయన్న సమాచారం మేరకే బలగాలు 21 రోజుల పాటు ఆపరేషన్ చేపట్టాయి. అభూజామఢ్ అటవీ ప్రాంతంలోనే షెల్టర్ ఏర్పాటు చేసుకున్న హిడ్మా లక్ష్యంగానే చత్తీస్ గడ్ బలగాలు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తుంటాయి. ఆయన స్వగ్రామమైన పువ్వర్తిలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ జాతీయ జెండాను ఎగురవేశామని అప్పట్లో కేంద్ర బలగాలు ప్రకటించాయంటే ఆయన ఏ స్థాయి మోస్ట్ వాంటెడ్ పర్సన్ అన్న విషయం అర్థం చేసుకోవచ్చు. హిడ్మా పట్టుబడితే అది అషామాషీ విషయం కాదని, మూడు నాలుగు రాష్ట్రాలకు చెందిన బలగాలు ఘన విజయం సాధించామని ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర కమిటీ ముఖ్యనేతల కంటే కూడా మిలటరీ కమాండర్ మడావి హిడ్మానే మోస్ట్ వాంటెడ్ పర్సన్ అని భావిస్తాయి బలగాలు.

ఒకే పేరేంటి..?

అయితే విప్లవ పంథాలో పోరాటం చేస్తున్న నక్సల్స్ మారుపేర్లతో సంచరించడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. వారి అసలు పేర్లు మార్చుకోవడం వల్ల తమ ఉనికి పోలీసులకు అంత సులువుగా దొరికే అవకాశం ఉండకపోవడంతో పాటు ఉద్యమంలో చనిపోయిన వారిని స్మరించుకునేందుకు అలియాస్ పేర్లు పెట్టుకుంటారు. అయితే చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి కలిసివచ్చే పేరు ‘హిడ్మా’ కావడం విశేషం. అక్కడి ఆధివాసీలు హిడ్మా అనే పేరు పెట్టేందుకు తల్లిదండ్రులు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. చాలా మంది పేరెంట్స్ తమ వారసులకు హిడ్మా అని నామకరణం చేయడం సెంటిమెంట్ గా ఫీలవుతారు. దీంతో పూర్వ బస్తర్ జిల్లాలోని కొన్ని అటవీ ప్రాంతాల్లో హిడ్మా అనే పేరు సర్వసాధారణంగా వినిపిస్తుంటుంది. దాదాపు 12 ఏళ్ల క్రితం తెలంగాణాలోని హుస్నాబాద్ ప్రాంతంలో అండర్ టన్నెల్ నిర్మాణంలో కూలీల వేషంలో వచ్చిన వారిలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని పేరు ఎడ్మగా చెప్పినప్పటికీ అతని పేరు హిడ్మానే అని తెలుస్తోంది. అంతేకాకుండా చత్తీస్ గడ్ పోలీసుల ముందు లొంగిపోయిన వారు, అరెస్ట్ అయిన వారిలో ఇప్పటికే పలువురు హిడ్మాలు ఉన్నారు. అంటే దండకారణ్యంలో హిడ్మా అనే పేరుతో ఉన్న వారు కామన్ అన్నది నిజం. ఓరకంగా చెప్పాలంటే ఈ పేరుతో వందలాది మంది ఉండడం కూడా మావోయిస్టు పార్టీకి కూడా కలిసివస్తున్నదని చెప్పవచ్చు. ప్రస్తుతం మిలటరీ ప్లాటూన్స్ కమాండర్ గా ఉన్న హిడ్మా సేఫ్ గా ఉండడానికి కూడా లాభిస్తోందన్న అంచనాలు కూడా ఉన్నాయి.

You cannot copy content of this page