Maoist : జేఏసీలు ఏర్పాటు చేయండి… చర్చలకు ఒప్పుకునేలా ఒత్తిడి తీసుక రండి…

మావోయిస్టు పార్టీ సికాస పేరిట ప్రకటన విడుదల

దిశ దశ, పెద్దపల్లి:

దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ వల్ల విప్లవకారులు పెద్ద ఎత్తున మరణిస్తున్నారని, ఆదివాసీలు, మావోయిస్టులు వేర్వేరు కాదని ఆ పార్టీ సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ (సికాస) ఒక ప్రకటన విడుదల చేసింది. 2024లో ప్రారంభం అయిన ఆపరేషన్ కగార్ కారణంగా పార్టీ కార్యదర్శి నంబళ్ల కేశవరావుతో పాటు 540 మంది మావోయిస్టు పార్టీ బాధ్యులు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉద్యమం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందని, అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితులు వీర తెలంగాణ పోరాటం, శ్రీకాకుళం నక్సల్ బరి ఉద్యమం, ఉత్తర తెలంగాణ పోరాటంలోనూ ఎదుర్కొందని గుర్తు చేసింది. దండకారణ్యంలో సల్వాజుడూం నుండి కగార్ వరకు పలు రకాల నిర్భందాలను ఎదుర్కొని పార్టీని విస్తరించుకోవడంలో సఫలం అయ్యామని సికాస పేరిట విడుదల అయిన ఆ లేఖలో స్పష్టం చేసింది. అప్పటిలాగే ఇప్పుడు కూడా ప్రతికూలతను ఎదుర్కొని పార్టీని కాపాడుకునేందుకు ప్రజా పునాదిని పటిష్టం చేసుకుందామని పిలుపునిచ్చింది. 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీ అంతం కావడం అసాధ్యమని, నిర్భందం తీవ్రతరం కావడంతో పార్టీ నష్టపోయింది వాస్తవమే అయినప్పటికీ పెద్ద సంఖ్యలో పార్టీ నిర్మాణం కొనసాగుతోందని ఆ ప్రకటనలో పేర్కొంది. కర్రె గుట్టల్లో 22 రోజుల పాటు 24 వేల మంది బలగాలు దాడులు చేసి సాధించింది శూన్యమేనని, అనారోగ్యంతో ఉన్న వారిని, గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న వారిని మొత్తం 31 మందిని ఎన్ కౌంటర్ పేరిట కాల్చి చంపారని సికాస ఆరోపించింది. చివరకు పార్టీ క్యాడర్ ను ఏమి చేయలేక వెనుదిరిగి పోయి పార్టీ విజయ ఢంకా మోగించినట్టుగా చెప్పుకుంటున్నారని విమర్శించింది. వైమానిక దాడులు, డ్రోన్ దాడులు, ఆధునిక టెక్నాలజీని నిర్వీర్యం చేస్తూ అన్ని వర్గాల వారు విప్లవోద్యమాన్ని రక్షించుకుంటున్నారని సికాస వెల్లడించింది. తెలంగాణ ప్రాంతంలో అనేక ఉద్యమాలు నడిపించిన చరిత్ర ఉందని, సింగరేణితో పాటు ఇతర రంగాల్లో పని చేస్తున్న అసంఘటిల రంగ కార్మికుల్లో పోరాట చైతన్యం ఉందని, వారిలోని ఈ పోరాట చైతన్యాన్ని పార్టీ శ్రేణులు మరింత పదునెక్కించాల్సిన అవసరం ఉందని సికాస అభిప్రాయపడింది. కార్మికులు, ప్రజల మద్దతు కూడగట్టుకుని ఆపరేషన్ కగార్ ను తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది. వివిధ సెక్షన్ల ప్రజలతో మమేకమై జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)లు ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపే విధంగా ఒత్తిడి తీసుకరావాలని సికాస పేరిట విడుదలైన ప్రకటనలో కోరింది.

తెలుగు రాష్ట్రాల్లో బంద్…

ఆపరేషన్ కగార్ ను నిరసిస్తూ ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాలలో ఈ నెల 20న బంద్ కు పిలుపునిచ్చింది మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదలైన లేఖలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న ఈ ఆపరేషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కోరింది. పార్టీ శ్రేణులను పట్టుకుని కాల్చి చంపుతున్నారని కూడా ఆరోపించిన జగన్ ఈ నెల 20 బంద్ పాటించాలని అన్ని వర్గాల వారిని కోరాడు.


You cannot copy content of this page