కాళేశ్వరం రహదారిలో ట్రాఫిక్ జాం
దిశ దశ, కాళేశ్వరం:
సరస్వతి పుష్కరాల నేపథ్యంలో మూడో రోజున కాళేశ్వరానికి భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది. వీకెండ్స్ కావడంతో ప్రైవేటు వాహనాల్లో భారీగా భక్తులు కాళేశ్వరం చేరుకుంటున్నారు. దీంతో మహదేవపూర్, కాళేశ్వరం రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలను క్రమబద్దీకరించేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ లు బైకుపై తిరుగుతూ వాహనాలను పంపించే పనిలో నిమగ్నం అయ్యారు శనివారం వేకువ జాము నుండే పెద్ద సంఖ్యలో వాహనాలు కాళేశ్వరం చేరుకుంటున్నాయి. శుక్రవారం అర్థరాత్రి ఈదురు గాలులు రావడంతో పుష్కర ఘాట్ తో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతులను పునరుద్దరించే పనిలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలు నిమగ్నం అయ్యారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడడంతో విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ కో యంత్రాంగాన్ని పురమాయించారు. ఓ వైపున ఈదురు గాలుల కారణంగా టెంట్లు, ఇతరాత్ర వసతులు నేలకూలిపోగా వాటిని సవరించే పనుల్లో ప్రత్యక్ష్యంగా కలెక్టర్, ఎస్పీలు హాజరయ్యారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం రహదారిలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయన్న సమాచారం అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు ఇద్దరు తమ కాన్వాయిలను పక్కన పెట్టి బైకుపై తిరుగుతూ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టించారు. శని, ఆది వారాల్లో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ శుక్రవారం రాత్రి వచ్చిన ఈదురు గాలుల ప్రభావం కాళేశ్వరంపై తీవ్రంగా పడింది.