దిశ దశ, ములుగు:
విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు ఆధర్శప్రాయంగా ఉండాల్సిన జిల్లా విద్యాశాఖాధికారే లంచం కోసం కక్కుర్తి పడ్డారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి సెలవుపై వెల్లొచ్చిన ఓ టీచర్ ను లంచం కోసం వేధింపులకు గురి చేశాడు. చేయి తడపనిదే పని చేసేది లేదని భీష్మించుకుని కూర్చున్న జిల్లా విద్యాధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో అవినీతికి పాల్పుతున్న డీఈఓ, జూనియర్ అసిస్టెంట్లను రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు.
యాక్సిడెంట్ కావడంతో…
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఒకరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 2024 ఫిబ్రవరి నెలలో రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో గత అక్టోబర్ వరకు ఆయన సిక్ లీవు తీసుకుని రెస్ట్ తీసుకోవల్సి వచ్చింది. సిక్ పీరియడ్ తరువాత అక్టోబర్ 1న లక్ష్మీపురం స్కూల్ లో రిపోర్ట్ చేయగా, మూడు మాసాలకు పైగా లీవు తీసుకున్నందున మిమ్మల్ని డీఈఓ కార్యాలయానికి సరెండర్ చేశామని అక్కడి హెడ్ మాస్టర్ వెల్లడించారు. దీంతో సదరు టీచర్ డీఈఓ కార్యాలయానికి వెల్లి జాయిన్ కాగా, అతనికి రీ పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వల్సి ఉన్నప్పటికీ డీఈఓ పాణిని ఈ మేరకు చొరవ తీసుకోలేదు. రీ పోస్టింగ్ ఆర్డర్ కావాలంటే రూ. 20 వేలు లంచం ఇవ్వాలని డీఈఓ పాణిని డిమాండ్ చేయగా, ఈ ఆర్డర్ ప్రిపేర్ చేసేందుకు ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ రూ. 5 వేలు లంచం అడిగారు. 2024 అక్టోబర్ నుండి గత వేసవి సెలవులు వచ్చే వరకూ కూడా బాధిత టీచర్ డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నా ఫలితం లేకుండా పోయింది. వేసవి సెలవులు ముగిసిన తరువాత ఈ నెల 12 తిరిగి ములుగు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి వెల్లిన బాధిత టీచర్ తాను అంత మొత్తంలో డబ్బులు ఇచ్చుకోలేనని, తనకు జీతం కూడా రావడం లేదని డీఈఓను వేడుకున్నాడు. అయినప్పటికీ డీఈఓ మాత్రం ససేమిరా అనడంతో బాధిత టీచర్ బ్రతిమాలడంతో తాను అడిగిన లంచం డబ్బు రూ. 20 వేలలో రూ. 5 వేలు తగ్గించి ఇవ్వాలని డీఈఓ కనికరించారు. దీంతో సదరు టీచర్ వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో సోమవారం రూ. 15 వేలు లంచం తీసుకున్న డీఈఓ పాణీని, రూ. 5 వేలు లంచం తీసుకున్న జూనియర్ అసిస్టెంట్ దిలీప్ లను రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు.
ఫిబ్రవరిలోనే…
అయితే బాధిత టీచర్ రీ పోస్టింగుకు సంబంధించిన ఉత్తర్వులను ఫిబ్రవరి నెలలోనే సిద్దం చేసినప్పటికీ లంచం డబ్బులు ఇవ్వకపోవడం వల్లే ఇవ్వలేదని ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. ఫిబ్రవరి నెలలో జాయినింగ్ ఆర్డర్స్ తయారు చేసిన ములుగు డీఈఓ లంచం డబ్బులు ఇచ్చేవరకూ కూడా ఆర్డర్స్ తన కార్యాలయంలోనే అట్టిపెట్టుకుని ఈ రోజు లంచం ముట్టగానే ఆ ఆర్డర్స్ బయటకు తీసినట్టుగా ఏసీబీ అధికారుల విచారణలో తేలింది.