కరీంగనర్ న్యాయవాది పేరిట వసూళ్లు…
దిశ దశ, కరీంనగర్:
ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ చేయడం… ఏపీకె ఫైల్స్ పంపించి మొబైల్స్ హ్యాక్ చేయడమే కాకుండా సరికొత్త తరహా మోసానికి పాల్పుడుతున్నారు సైబర్ నేరగాళ్లు. కరీంనగర్ కు చెందిన ఓ న్యాయవాదికి కొరియర్ వచ్చిందని ఇంటి అడ్రస్ దొరకడం లేదని కాల్ చేసిన క్రిమినల్స్ ఓ లింక్ షేర్ చేశారు. లింక్ ఓపెన్ చేసిన వెంటనే అతని మొబైల్, వాట్సప్ హ్యాక్ చేసిన నేరగాళ్లు అతని స్నేహితులకు క్యూ ఆర్ కోడ్ పంపించి డబ్బులు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ విషయం తెలియని న్యాయవాది పరమేష్ గౌడ్ స్నేహితులు కొంతమంది అగంతకులు పంపించిన క్యూ ఆర్ కోడ్ కు డబ్బులు పంపించారు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న పరమేష్ గౌడ్ అనే అడ్వకేట్ కు కాల్ చేసిన అంగతకులు ఓ కొరియర్ సంస్థ నుండి డెలివరీ చేసేందుకు వచ్చామని, ఇంటి అడ్రస్ దొరకడం లేదని చెప్పారు. తనకు ఏ కొరియర్ రాలేదని వారిని వారించినప్పటికీ బ్యాంకు నుండి వచ్చిందని అంగతకులు వివరించారు. బ్యాంకులకు స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ గా కూడా సేవలందిస్తున్న పరమేష్ నిజంగానే తనకు బ్యాంకు నుండి కొరియర్ వచ్చి ఉంటుందని భావించాడు. అగంతకులు పంపించిన లింక్ ఓపెన్ చేసిన వెంటనే పరమేష్ వాట్సప్ హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ అతని స్నేహితులకు డబ్బులు పంపించాలని కోరుతూ క్యూ ఆర్ కోడ్ షేర్ చేశారు. అయితే పరమేష్ వాట్పస్ హ్యాక్ అయిందన్న విషయం తెలియని కొంతమంది స్నేహితులు చకాచకా డబ్బులు పంపించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న పరమేష్ ఫ్రెండ్స్ రూ. 2 లక్షల వరకు పంపించినట్టుగా ఇప్పటి వరకు తెలిసింది. సోమవారం సాయంత్రానికి పరమేష్ గౌడ్ వాట్పస్ హ్యాక్ అయిన విషయం గుర్తించినప్పటికీ అప్పటికే జరిగే నష్టం జరిగిపోయింది. అగంతకులకు డబ్బులు పంపి మోసపోయిన వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

