కాళేశ్వరం ప్రాజెక్టు తీరుపై సరికొత్త చర్చ…
దిశ దశ, కాళేశ్వరం:
అది 2023 అక్టోబర్ 21 సాయంత్రం… మహారాష్ట్ర వైపు నుండి తెలంగాణకు వచ్చే వాహనాలు, తెలంగాణ నుండి మహారాష్ట్ర వైపునకు వెల్లే వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు ప్రాజెక్టు అధికారులు. బారులు తీరిన వాహనదారులకు అసలు ఏమైందోనన్నది అంతు చిక్కకుండా పోయింది. అంతలోనే నెమ్మదిగా అసలు విషయం బయటకు పొక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయన్న విషయం వెలుగులోకి రావడంతో రాత్రికిరాత్రే జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. అప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు హుటాహుటిన మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని మేడిగడ్డ బ్యారేజీలో భారీ శబ్దం వచ్చిందని, పిల్లర్లు కుంగిపోయాయని… కుట్ర దాగి ఉండొచ్చన్న కోణంలో ఫిర్యాదు చేశారు. పబ్లిక్ ప్రాపర్టీ విషయం కావడంతో పోలీసులు కూడా హుటాహుటిన కేసు నమోదు చేశారు. అయితే ఆ తరువాత దేశంలోని ఆనకట్టల భద్రత కమిటీ NDSA రంగంలోకి దిగింది. బ్యారేజీని క్షేత్ర స్థాయిలో పరిశీలించడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల తీరు తెన్నుల గురించి వివరాలను తెలుసుకుంది. వెంటనే మూడు బ్యారేజీల్లో నీటిని నిలువ చేయవద్దని సూచించింది. టెక్నికల్ అంశాలపై అధ్యయనం చేస్తున్న నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) ఓ వైపున అధ్యయనం చేస్తున్న క్రమంలోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణ చేపట్టాలని విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులను ఆదేశించింది. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ రాజీవ్ రతన్ నేతృత్వంలో బృందాలుగా ఏర్పడిన అధికారులు కాళేశ్వరం కార్యాలయాలు, ప్రాజెక్టుల ప్రాంతాలను పరిశీలించారు. ఈ ఏడాది మార్చి 5న విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా ఈ నివేదికను విజిలెన్స్ కమిషన్ కూడా మార్చి 18న ఆమోదించింది. పలువురు ఇంజనీర్లపై క్రమ శిక్షణ చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం నివేదిక ఇవ్వడం గమనార్హం.
ఎవరెవరిపై అంటే..?
విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఇచ్చిన నివేదికలో పలువురు ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్స్ చేసింది. ఈ జాబితాలో్ రిటైర్డ్ జనరల్ ఈఎన్సీలుగా పని చేసిన మురళీ ధర్, భూపతి రాజు నాగేందర్ రావు, తొడుపునూరి శ్రీనివాస్, వి ఫణిభూషన్ శర్మ, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మహ్మద్ అజ్మల్ ఖాన్, రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, చీఫ్ ఇంజనీర్ కొట్టె సుధాకర్ రెడ్డి, బి వెంకట రమణారెడ్డి, సర్దార్ ఓంకార్ సింగ్, సిహెచ్ తిరుపతి రావు, బి వెంకటేశ్వర్లు, వి అజయ్ కుమార్, పిఏ వెంకట కృష్ణ, ఎ: రఘు రాం, ఎ నరేందర్ రెడ్డి, మాజీ సీఈ కెఎస్ఎస్ చంద్రశేఖర్, ఎస్ బస్వ రాజ్ మొత్తం 17 మందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఫార్సు చేసింది.
సెక్షన్లు ఇవే…
ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 120 (బి), 336, 409, 418, 423, 426, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988, ఆనకట్టల భద్రతా చట్టం 2021, పీడీపీపీ యాక్ట్ 1984లలో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకులో పిల్లర్లు కుంగిపోయినప్పుడు క్రిమినల్ కేసు నమోదు చేసిన ఇరిగేషన్ విభాగం ఇంజనీర్లే నేడు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవల్సి రావడం విచిత్రమనే చెప్పాలి. సాంకేతికపరమైన అంశాలతో పాటు ప్రభుత్వ ఆస్తులన్న విషయాన్ని విస్మరించిన తీరే నేడు ఇరిగేషన్ అధికారులను కేసుల్లో ఇరికించేలా చేసిందన్నది వాస్తవం. ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉన్నా రికార్డులు నమోదు చేసేది మాత్రం తామేనన్న విషయాన్ని విస్మరించిన తీరుపై విస్మయం వ్యక్తం అవుతోంది. జవాబుదారితనం, విశ్వాసంతో విధులు నిర్వర్తించే విధానంతో వ్యవహరించకపోవడం వల్లే ఈ దుస్థితి ఎదురయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
రికార్డుల కాళేశ్వరం…
ప్రపంచంలోనే ఎగువ ప్రాంతానికి నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో కాళేశ్వరం రికార్డుల మోత మోగించింది. గోదావరి జలాలను ఎగువ ప్రాంతానికి తరలించే ప్రక్రియలో భాగంగా చేపట్టిన కాళేశ్వరం ఆస్ట్రియా మోటార్లు, అండర్ టన్నెల్లు, భూగర్భంలో బహుళ అంతస్తులు భవనాల నిర్మాణం తదితర అంశాలపై రికార్డులను క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోత పథకంగా కాళేశ్వరం రికార్డుల్లోకి ఎక్కడం ఓ ఎత్తు అయితే, దేశ విదేశాల్లో కాళేశ్వరం గురించి ప్రచారం జరగడం కూడా మరో ఎత్తని చెప్పవచ్చు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో కాంక్రీట్ పనులను ఉపయోగించిన రికార్డులు కూడా బద్దలు కొట్టినట్టుగా ఇరిగేషన్ ఇంజనీర్లు ఢంకా బజాయించి చెప్పుకున్నారు.
దుబాయ్ రికార్డ్ బ్రేక్…
మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో కాంక్రీట్ వర్క్స్ నిర్విరామంగా చేపట్టిన విషయంలో దుబాయి రికార్డులను బ్రేక్ చేశారు ఇరిగేషన్ ఇంజనీర్లు. దుబాయికి చెందిన ఇంజనీరింగ్ కంపెనీ 35 గంటల 19 నిమిషాల్లో 21,580 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ పనులు చేపట్టింది. ఓ రెసిడెన్షియల్ భవన నిర్మాణంలో భాగంగా 2017 మే 18 నుండి 20 వరకు భారీ స్థాయిలో కాంక్రీట్ పనులు చేపట్టడం రికార్డులు నమోదు చేసింది. అయితే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ ఇంజనీర్లు మాత్రం కేవలం 24 గంటల్లో 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ సిద్దం చేయగా ఇందు కోసం 6,238 మెట్రిక్ టన్నుల సిమెంట్ (లక్షా 24 వేల బ్యాగులు), 1070 మెట్రిక్ టన్నుల స్టీల్, 8 బ్యాచింగ్ ప్లాంట్లను ఉపయోగించారు. గంటకు 870 క్యూబిక్ మీటర్ల చొప్పున కాంక్రీట్ సిద్దం చేసిన ఇంజనీర్లు ఇందు కోసం 20 భూంప్లేసర్స్, ట్రాన్సిస్ట్ మిక్సర్ల నుండి సైట్ వద్దకు కాంక్రీట్ రవాణా చేసేందుకు 120 లారీలను ఉపయోగించారు. మొత్తం 210 మంది ఇంజనీర్లు ఇందు కోసం శ్రమించగా ఇందులో ఇరిగేషన్, ఎల్ అండ్ టి సంస్థలకు చెందిన వారు ఉన్నారు. 5,500 మంది వర్కర్లు ఈ రికార్డు క్రియేట్ చేయడంలో తమ వంతుగా శ్రమించగా, 57 ఎక్స్ కావేటర్లు, క్రేన్లను ఉపయోగించారు. 2018 డిసెంబర్ 22న ఈ రికార్డు బ్రేక్ చేసిన కాళేశ్వరం ఇంజనీర్లు గేట్ల ఏర్పాటుతో పాటు మరెన్నో అంశాల్లో కూడా రికార్డులు క్రియేట్ చేశారు.
నాలుగేళ్లలోనే…
2016లో నిర్మాణం మొదలైన కాళేశ్వరం ప్రాజెక్టు 2019లో పూర్తయినట్టుగా అధికారులు ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తయిన నాలుగేళ్ల నాలుగు నెలల్లోనే కుంగుబాటుకు గురికావడం సంచలనంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ ఏడో బ్లాకులోని పిల్లర్లు కుంగిపోవడంతో ఇంజనీర్ల పనితీరుపై మాయని మచ్చ పడినట్టయింది.