దిశ దశ, వేములవాడ:
పోలీసుల తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలను స్థానిక ఎమ్మెల్యే బెదిరింపులకు గురి చేస్తుంటే వంత పాడుతున్నారని మండి పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీసులు పద్దతి మార్చుకోకపోతే వేములవాడలోనే కూర్చుంటానని, డీజీపీ ఎస్పీని ఇక్కడకు రప్పించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. వేములవాడ బీజేపీ నాయకులపై సిరిసిల్ల సీఐ కృష్ణ ఓవర్ యాక్షన్ ప్రదర్శించిన తీరుపై కేంద్ర మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఐని వెంటనే విధుల నుండి తప్పించాలని లేనట్టయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని చూస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ వారి మాటలు విని శాంతి భధ్రతలకు విఘాతం కల్గిస్తే పోలీసులే ఇబ్బందుల్లో పడతారన్న విషయం గుర్తు పెట్టుకోవాలని బండి సంజయ్ స్పష్టం చేశారు. తాను గౌరవంగా చెప్తున్న ఈ మాటలు విని చేతకాని తనంగా భావిస్తే ఏం చేయాలో తనకు తెలుసని మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు.